బాబు కీలక నిర్ణయం: జగన్, పవన్ పార్టీలతోపాటు రేపు అఖిల పార్టీలతో భేటీ!, ఏప్రిల్లో ఢిల్లీకి..
అమరావతి: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ కేంద్రంతో పోరాటం చేస్తున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సోమవారం జరిగిన సమావేశంలో అన్ని పార్టీలు, అఖిల సంఘాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఒక్కో రాజకీయ పార్టీ, సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించనున్నారు.
జగన్ పార్టీతోపాటు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వివిధ సంఘాలను ఈ సమావేశానికి పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వైయస్ జగన్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శులకు సమాచారం అందించామని ఇప్పటికే ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ సమావేశం సచివాలయంలోనా లేదంటే సీఎం నివాసంలోని ప్రజాదర్భార్లో నిర్వహిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
కలిసికట్టుగా పోరాటం
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన పోరాటానికి సంబంధించి మంగళవారం ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపై ఉన్నాయనే సంకేతాలు పంపడంతో పాటు, అంతా కలిసికట్టుగా పోరాడుతున్నామనే విషయాన్ని కేంద్రానికి తెలియజేసేందుకే ఈ అఖిల సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్కో పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులు
ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు ప్రభుత్వం తరఫున కూడా ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. జనసేన పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాగా, ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన అన్ని హామీలను సత్వరమే పరిష్కరించి రాష్ట్ర ప్రజలకు తగు న్యాయం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
అఖిలపక్షంతో ఢిల్లీకి
ఒకవేళ మంగళవారం అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరగకపోయినా, కేంద్రం దిగి రాకపోయినా వచ్చే నెల(ఏప్రిల్) మొదటి వారంలో అఖిల సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే యోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని లేదా కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.