తునిలో చెలరేగిన హింస: పోలీసులపై ఆగ్రహం, చంద్రబాబు అత్యవసర సమావేశం
విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, అధికారులు అంతా సమావేశానికి హాజరు కావాలని ఆయన ఆదేశించారు. పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. పరిస్థితిని హోం శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చంద్రబాబుకు ఎప్పటికప్పడు వివరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకే చెందిన చినరాజప్ప సమావేశానికి ముందు ముద్రగడ పద్మనాభాన్ని చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అయితే, ముద్రగడ పద్మనాభం చర్చలకు నిరాకరించినట్లు తెలుస్తోంది. తమ బలమేమిటో నిరూపించిన తర్వాతనే ఏదైనా అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. హింసాత్మకంగా మారిన నేపత్యంలో తునికి అదనపు బలగాలను తునికి తరలిస్తున్నట్లు డిజిపి జెవి రాముడు చెప్పారు. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేస్తున్నారని ఆయన చెప్పారు.
తుని ఘటనలు నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. విజయవాడ రైల్వే స్టేషన్ కు భారీ భద్రత కల్పించారు. విశాఖ, విజయవాడల మద్య రైళ్లన్నీ నిలిచిపోయాయి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు ఎనిమిది దగ్ధమయ్యాయి. ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రత్నాచల్ రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.
చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠినంగా శిక్షిస్తామని డిజిపి రాముడు హెచ్చరించారు. తూర్పో గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు మాట్లాడారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై, రైలు పట్టాలపై బైఠాయించారు.












Click it and Unblock the Notifications