జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ-పెట్టుబడులు, స్టార్టప్లకు చంద్రబాబు ఆహ్వానం..!
అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటంచారు. 2026 జనవరి 1 నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ సిద్దమవుతుందన్నారు. విజయవాడలో క్వాంటం టెక్నాలజీపై ఏర్పాటు చేసిన జాతీయ స్దాయి వర్క్ షాప్ లో ఆయన కీలక ప్రసంగం చేశారు. క్వాంటం వ్యాలీకి అనుబంధంగా ఒక ఎకోసిస్టం ఏర్పాటు చేస్తామని పెట్టుబడిదారులకు ఆయన హామీ ఇచ్చారు.
ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్కు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు బాబు వివరించారు. క్వాంటం కంప్యూటింగ్ను భారత్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. క్వాంటం వ్యాలీ పార్క్ కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్ ను పరీక్షిస్తామన్నారు. ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదని, వివిధ ఉపకరణాల నుంచి రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరమని ఆయన తెలిపారు.
క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలు ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవమని, ఈ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయని బాబు తెలిపారు. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరియేబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా వస్తోందని, దీన్ని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరమని తెలిపారు.

క్వాంటం రంగంలో స్టార్టప్లు రావడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆవిష్కరణకు ఆకాశమే హద్దు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటుచేస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలు, స్టార్టప్లకు ఆయన సూచించారు. ఈ సమయంలో బహుళజాతి కంపెనీలు భాగస్వాములు కావాలని, ఇప్పుడే పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్లోనే ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడి మార్కెట్ను వినియోగించుకోవాలన్నారు.
చివరిగా కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో చదువుకున్న నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉండటం సంతోషదాయకమని, గతంలో ఈ శాఖను గ్రాడ్యుయేషన్ చదువుకున్నవారు నిర్వర్తించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లోకేష్కు క్వాంటం వ్యాలీ ద్వారా ఒక విజన్ లక్ష్యాలను సాధించే బాధ్యతను అప్పగించానని సీఎం తెలిపారు.












Click it and Unblock the Notifications