టిడిపి పాత సామాన్ల దుకాణం: బాబుపై కిరణ్ రెడ్డి
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో అన్యాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తాను లేఖ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆ ప్రాంతంలో చెప్పుకుంటూ సీమాంధ్రలో మరో విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ పాత సామాన్ల దుకాణంగా మారిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన గుంటూరు జిల్లా తెనాలి రోడ్డు షోలో ప్రసంగించారు.
రాష్ట్ర విభజన విషయంలో నీతి తప్పి వ్యవహరించిన పార్టీలను నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. విభజనకు కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజన ఏదో ఒక దశలో ఆగి తీరుతుందన్న కిరణ్ రెడ్డి అన్నారు. విభజన వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఆయన అన్నారు. విభజన విషయంలో సోనియాగాంధీ వేసుకున్న లెక్కలు తప్పు అవుతాయని అన్నారు.
తెలుగు జాతిని ఎందుకు చీల్చారో కాంగ్రెస్ ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేక పోతోందన్నారు. తెలుగు జాతిని విభజించడం పొరపాటని సోనియా గాంధీకి తాను ముందే చెప్పానని, అయినా పట్టించుకోలేదని తెలిపారు. అసెంబ్లీలో తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించడం అప్రజాస్వామికం అన్నారు. విభజనకు సహకరించి ఉంటే తాను మరి కొంత కాలం పదవిలో కొనసాగే వాడినని, విభజన ఇష్టం లేకే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నానని చెప్పారు.
తెలుగుజాతికి జరిగిన అవమానానికి బదులు తీర్చుకునే సమయం వచ్చిందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందనారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు కడుతున్న పన్నుల తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అటువంటి నగరాన్ని విడిచి పొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. రానున్న ఎన్నికలలో తమ పార్టీని గెలిపిస్తే విభజన బిల్లు వెనక్కి వెళుతుందని, చరిత్ర తిరగ రాస్తామని ఆయన అన్నారు.