కెసిఆర్ అడ్డగోలుగా మాట్లాడినందుకే..: బాబు, లోకేష్కు కితాబు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తన గురించి అడ్డగోలుగా మాట్లాడినందుకే తాను కూడా తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్లో శనివారంనాడు జరిగిన పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో నామినేటెడ్ పదవులపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఏప్రిల్ 29న ఢిల్లీలో అమిత్షాతో భేటీ వాయిదా పడిందని, ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్షాను కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని చెప్పారు.
ఏపీలో బీజేపీ నేతలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు ఢిల్లీలో తమకు కావాల్సిన పదవులపైనా చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా మహానాడుపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. మహానాడును విజయవాడలో పెడదామని కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు సూచించారు. అయితే మెజారిటీ నేతలు హైదరాబాద్ కే ఓటేయడంతో మహానాడు వేదిక మారింది.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడినట్లు ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈనెల 10న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ, 14న అండమాన్లోనూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
టీడీపీని జాతీయపార్టీగా మార్చడం కోసం చట్టపరమైన చర్యలకు త్రిసభ్య కమిటీని నియమించారని అందులో తనతో పాటు యనమల, రావుల సభ్యులని ఆయన వెల్లడించారు. కాగా, పోలిట్ బ్యూరో సమావేశానికి నారా లోకేష్ ఓ నివేదికను సమర్పించారు.












Click it and Unblock the Notifications