మోడీపై చంద్రబాబు విసుర్లు: కమలానికి దూరమే
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్థిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో బిజెపిపై కూడా నిందలు మోపారు. విజయనగరంలో బుధవారం జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన బిజెపిపై విమర్శలు చేశారు. దీన్నిబట్టి బిజెపికి దూరంగా ఉండాలని ఆయన కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో మోడీ కబుర్లు చెప్పారని, కానీ న్యాయం చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. గుజరాత్ను మోడీ అభివృద్ధి చేశారని, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, ఇద్దరం కలిసి నడిచి దేశాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెసును పారదోలాలని ఆశించానని, మోడీతో మాట్లాడానని, కానీ విభజన విషయంలో మోడీ న్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు.
పార్లమెంటులో బిజెపి వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పు పట్టారు. పార్లమెంటులో బిజెపి సరిగా పోరాడలేదని, సీమాంధ్రకు న్యాయం చేయలేదని చంద్రబాబు విమర్శించారు.
కాంగ్రెసు పేరు చెప్తే సంఘ బహిష్కరణ
కాంగ్రెసు పార్టీయే సీమాంద్రలో ఉండకూడదని, కాంగ్రెసు పేరు ఎత్తితే సంఘ బహిష్కరణ చేయాలని ఆయన అన్నారు. జగన్ కాంగ్రెసు దత్తపుత్రుడని, ఆ దత్తపుత్రుడిని ఓడించాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే సోనియా గాంధీకి వేసినట్లేనని ఆయన అన్నారు. బాధల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడానికే ఇక్కడి వచ్చానని ఆయన అన్నారు.
తెలంగాణ, సీమాంధ్రలో 30-35 సీట్లు గెలిచి, కేంద్రంలో చక్రం తిప్పుదామని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. గతంలో తనకు అవకాశం వచ్చినా ప్రధాని పదవిని చేపట్టలేదని ఆయన అన్నారు.
సీమాంద్రను ఉత్తర కొరియా, చైనా, సింగపూర్ మాదిరిగా తాను అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణను సామాజిక తెలంగాణగా రూపు దిద్దుతామని ఆయన అన్నారు. కాంగ్రెసులో దుర్మార్గులే ఉంటారని ఆయన అన్నారు. తమ కుటుంబానికి ఏ పదవులూ అక్కరలేదని, తనకు ఏ కోరికలూ లేవని ఆయన అన్నారు. తెలుగుజాతికి పూర్వవైభవం తేవడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.
సోనియా చూస్తుందని పార్లమెంటులో జగన్ దాక్కున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేస్తే సీమాంధ్ర ప్రజలు మునిగిపోతారని ఆయన అన్నారు. తాను నిప్పులాగా బతికానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, సోనియా లాంటి వేయి మందిని కూడా ఏమీ చేయలేరని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు తీరేదాకా అండగా ఉంటానని ఆయన చెప్పారు.