ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబు ధీమా వెనుక..!!
ఏపీలో ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్లుగా మారింది. వైసిపి, టిడిపి కూటమి మధ్య పోటీ ఉత్కంఠ పెంచుతుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తొలినుంచి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లెక్కలు ఏంటి.. గెలుపు పై ధీమా వెనక ఏం జరుగుతుంది.
చంద్రబాబు లక్ష్యం
2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన టిడిపికి ఈసారి అధికారం దక్కించుకోవటం ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం జనసేన బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటయి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికల ముందే చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న అంశాలను తన ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు.

చంద్రబాబు, లోకేష్ యాత్రలు చేశారు, వీరికి మద్దతుగా పవన్ కళ్యాణ్ సైతం జగన్ ఓటమి లక్ష్యంగా వారాహి యాత్ర నిర్వహించారు. ఇక ఎన్నికల్లో చంద్రబాబు మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
చంద్రబాబు వ్యూహాలు
సంక్షేమ ఓట్ బ్యాంక్ పైనే ప్రధానంగా జగన్ నమ్మకం పెట్టుకోవడంతో దానిని కౌంటర్ చేసేందుకు చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేశారు. ముందుగానే సూపర్ సిక్స్ పథకాల ప్రకటనతో జగన్ ప్రధానంగా నమ్మకం పెట్టుకున్న మహిళా ఓట్ బ్యాంకు పైన గురి పెట్టారు. అదేవిధంగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందని ప్రతి సభలోను చెబుతున్నారు.
ఏపీ గత ఐదేళ్ల కాలంగా నష్టపోయిన విధానం వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికల పైన ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక సమీకరణాల్లోనూ టికెట్ల కేటాయింపు విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు.. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ప్రచార సభలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో..అదే విధంగా కీలక ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.

గెలుపు పై ధీమాగా
ఇక ఏపీలో ప్రధాని మోడీ నిర్వహిస్తున్న సభలతో కూటమిలో కొత్త జోష్ కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో గతం కంటే భిన్నంగా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా ఉపాధి కల్పన అవకాశాలపై భరోసా కల్పించారు. డీఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని ప్రకటించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రజల్లో ఉన్న ఆందోళన గుర్తించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని ప్రకటించారు.
తాజాగా ప్రధాని మోదీ సైతం వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటం..కూటమి అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేయటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజుల్లో తెర పడనుంది. ఉద్యోగ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందని చెబుతున్న కూటమి నేతలు..తిరిగి ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications