ముద్రగడకు కౌంటర్: కోట్ల జీఓతో అడుకుంటున్న చంద్రబాబు (పిక్చర్స్)
విజయవాడ: కాపు ఐక్య గర్జన నాయకుడు ముద్రగడ పద్మనాభం గతంలో రెండు సార్లు ప్రస్తుత పద్ధతిలోనే కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటి సారి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పోరాటం చేశారు.
తరువాత 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో సారి తూర్పు గోదావరి జిల్లా తునిలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. విషయం తెలుసుకున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి తన మంత్రి వర్గంతో చర్చించారు.
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అప్పుడే ముద్రగడ పద్మనాభం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి కాపు నాయకులు, కులస్తులు బహిరంగ సభకు హాజరైనారు. అదే సభకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హాజరైనారు.
అయితే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో జారీ చేసిన జీవో చెల్లలేదని, అందువల్ల అలాంటి జీవో విడుదల చేయడం వల్ల కాపులకు న్యాయం జరగదని, చట్టపరమైన సమస్యలను అధిగమించి రిజర్వేషన్లు కల్పించడానికి తాను కసరత్తు చేస్తున్నానని, అందుకే మంజునాథ్ కమిషన్ వేశానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రిజర్వేషన్లు ఇచ్చారు
కాపు గర్జన సభలో మాట్లాడిన అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 30 జారీ చేశారు.
అర్డినెన్స్ తెచ్చారు
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపులకు మేలు చెయ్యాలనే ఉద్దేశంతో అర్డినెన్స్ తీసుకువచ్చి కాపులకు న్యాయం చెయ్యడానికి ప్రయత్నించారు.
రెండు నెలలకే గొవిందా
కాపుల రిజర్వేషన్లు కేవలం రెండు నెలలు కూడా లేవు. కొందరు కొర్టులను ఆశ్రయించి కాపులకు బీసీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారు.
కాపులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి
తరువాత 1994లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాని హామీని ఇమలు చేయలేదు.
కాపులలో చిచ్చు పెట్టిన చంద్రబాబు
తరువాత 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపు నాయకుల మధ్య చిచ్చు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
జీఓ 30 ప్రయోగం
ఇప్పుడు కాపు ఐక్య గర్జన సందర్బంగా జీఓ 30ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయకుడు కాపులను మోసం చేస్తున్నారని ఆ కులస్తులు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నాయకులు అడ్డుకోలేదా
కాపు ఐక్య గర్జనకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో దాదాపు కాపు కులస్తులను అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
9 సంవత్సరాలు సీఎం, అప్పుడు తెలియలేదా
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు పని చేసిన అనుభవం చంద్రబాబు నాయుడికి ఉంది. 2013 ఎన్నికలకు ముందు కాపులకు హామి ఇచ్చే సమయంలో జీఓలు అడ్డు వస్తాయని తెలియలేదా అని కాపులు ప్రశ్నిస్తున్నారు.
కాపు మంత్రులకు ఆదేశాలు
అధికారంలో ఉన్న కాపు మంత్రులతో చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మీ జిల్లాల నుంచి కాపులు ఆందోళనలో పాల్గోనకుండా మీరే చూసుకోవాలని సూచించారని తెలిసింది.
జగన్ వాదన ఇదీ...
తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల కోటా పెంచి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే ఉంది కాబట్టి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్పించి కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని వాదిస్తున్నారు.