సీఎం జగన్ ట్రాప్ లో మరోసారి చంద్రబాబు - అసలుకే మోసం..!?
ఏపీ రాజకీయాలు ఎన్నికల దిశగా వెళ్తున్నాయి. ముందస్తుగానే సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఎత్తులు - పై ఎత్తులతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ పాలనపైన వచ్చిన వ్యతిరేకత - పొత్తులు తిరిగి తమను అధికారానికి దగ్గర చేస్తాయనేది చంద్రబాబు ధీమా. తాను చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం అధికారంలో కొనసాగేలా చేస్తుందనేది ముఖ్యమంత్రి జగన్ నమ్మకం. ఇదే సమయంలో చంద్రబాబు లక్ష్యంగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అందులో చంద్రబాబు చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఇదే కొనసాగితే టీడీపీకి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

సామాజిక న్యాయం - కొత్త నినాదాలు
ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజకీయాల్లో పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ కే నమ్ముకున్నారు. అందులో భాగంగా సామాజిక న్యాయం పేరుతో అధిక ఓటర్లు ఉన్న బీసీ - ఎస్సీ - ఎస్టీ- మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ తమ బలమైన ఓట్ బ్యాంకుగా చెప్పుకొనే బీసీ వర్గాలను 2019 ఎన్నికల్లో జగన్ తన వైపు తిప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆ మద్దతు కొనసాగేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇప్పటికే జయహో బీసీ సభ నిర్వహించిన సీఎం జగన్..త్వరలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లతో రాష్ట్రంలోనూ మూడు రీజియన్లలో సభలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పెత్తందార్లు - తానను నమ్మిన పేదల మధ్యే ఎన్నికల యుద్దమని జగన్ కొత్త నినాదం తీసుకొచ్చారు. ఫలితంగా టీడీపీ గతంలో నమ్ముకున్న ఓట్ బ్యాంకు తిరిగి ఆ పార్టీకి దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ఏపీలో ఉన్న సామాజిక సమీకరణాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలు ఎప్పటికే టీడీపీతోనే అని చెబుతున్న ఆ పార్టీ నేతలు సీఎం కు కౌంటర్ ఇచ్చేలా ఏం చేయబోతున్నారనేది ఇప్పటి కైతే స్పష్టత లేదు.

ప్రాంతీయ సమతుల్యత - గర్జనలు
సీఎం జగన్ మూడేళ్లుగా మూడు రాజధానుల నినాదాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికంగా -న్యాయ పరంగా చిక్కులు వస్తున్నా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి మాత్రమే రాజధాని అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. సీమ - ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పార్టీ అధినేత బాటలోనే ఉన్నారు. టీడీపీని సీమ - ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మూడు రాజధాను ల నినాదం ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం జగన్ వ్యూహం. అందులో భాగంగా విశాఖ - కర్నూలు కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు నిర్వహించారు. అందులో ప్రధానంగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూనే ప్రసంగాలు కొనసాగాయి. ఇదే సమయంలో సుప్రీం కోర్టులో అమరావతి - మూడు రాజధానుల కేసు విషయంలో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పులో అమరావతి నిర్మాణం కు టైం ఫిక్స్ చేయటం వంటి అంశాల పైన సుప్రీం స్టే ఇచ్చింది. తిరిగి విచారణ జనవరి 30కి వాయిదా వేసింది. అప్పటి నుంచి చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా ఎక్కడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అమరావతికి మద్దతుగానూ మాట్లాడటం తగ్గించేసారు.

ఆ రెండు అంశాలే టీడీపీకి గెలుపులో కీలకం
ఇప్పుడు టీడీపీ తాము అధికారంలోకి వస్తే సంక్షేమం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతీ సభలోనూ చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. కానీ, జగన్ నమ్ముకున్న సోషల్ ఇంజనీరింగ్ కు కౌంటర్ గా ఏం చేస్తారనేది ఇంకా టీడీపీ నుంచి స్పష్టత లేదు. తొలి నుంచి టీడీపీ ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టిన సీఎం జగన్ కొల్లగొట్టే ప్రయత్నాలు నిరంతరం కొనసాగిసున్నారు. కానీ, టీడీపీలో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకులను కాపాడుకొనే అస్త్రాలు కరువయ్యాయి. అదే విధంగా సుప్రీం తుది తీర్పు వరకు అమరావతి గురించి టీడీపీ గతంలో లాగా ఏకపక్షంగా మాట్లాడే అవకాశం కనిపించటం లేదు. దీంతో పాటుగా సంక్షేమ పథకాలు - మూడు రాజధానుల గురించి వ్యతిరేక వ్యాఖ్యలు తగ్గించారు. ఇదే సీఎం జగన్ కు కావాల్సింది. ఇక, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు చంద్రబాబు చేతిలో ప్రధానాస్త్రంగా మారుతోంది. పొత్తులు మరో కీలక అంశం కానున్నాయి. దీంతో, ఇప్పుడు సీఎం జగన్ వ్యూహాలకు 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఏ రకంగా కౌంటర్ చేస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications