వైసిపి ఎమ్మెల్యే అక్కడకెళ్లడమేంటి: ఓటుకు నోటుపై హైకోర్టుకు బాబు, కొంత ఊరట
విజయవాడ: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల పైన స్టే విధించాలని ఆయన పిటిషన్ వేశారు. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల నాని రామకృష్ణా రెడ్డి నేరుగా ఏసీబీ కోర్టుకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషన్ పైన విచారణ మధ్యాహ్నం 2.30 జరిగింది. చంద్రబాబు పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం దీని పైన రేపు విచారించే అవకాశాలున్నాయి. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల పైన స్టే ఇవ్వాలని హైకోర్టులో చంద్రబాబు డిస్పెన్స్ పిటిషన్ వేయగా.. దానిని కోర్టు అనుమతించింది.
గత ఏడాది ఓటుకు నోటు అంశం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టిడిపి నేత రేవంత్ రెడ్డి దొరికారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, ఆయన స్టీఫెన్తో ఫోన్లో మాట్లాడారనే వాదనలు ఉన్నాయి.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లి బెయిల్ పైన విడుదలయ్యారు. ఆ తర్వాత కేసు ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫోరెన్సిక్ ఆధారాలతో ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సెప్టెంబర్ 29వ తేదీలోపు పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం ఏసీబీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.