ప్రతిదీ గొడవనే: కెసిఆర్పై మరోసారి చంద్రబాబు రుసరుస
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పు పట్టారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బుధవారం హైదరాబాద్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వివాదం, తెలంగాణలో రైతుల ఆత్మహత్యల వంటి పలు కీలకమైన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నికెసిఆర్ కావాలనే వివాదం చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబుతో అన్నారు.
పాలమూరు పథకాన్ని మీరు అడ్డుకుంటున్నారని కెసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, తాము వాస్తవాలు వివరిస్తూ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నామని వారు చంద్రబాబుకు చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందించారు.
ఎన్టీఆర్ హయంలో హైదరాబాద్ను ఉదయాన్నేనిద్రలేపేవారంటూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, కేసీఆర్ ఈ విషయాన్నికూడా వివాదం చేయాలని చూశారని చంద్రబాబు వారితో అన్నారు.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు సూచించారు.