నాకు పనిలేక వచ్చానా?...వాళ్లకు పదవులు అవసరమా:మండిపడ్డ చంద్రబాబు
అమరావతి:తెలుగు దేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి గుంటూరు జిల్లా నేతలు గైర్హాజరు అవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో రగిలిపోయారు.
ఆ నేతలు ఎందుకు హాజరుకాలేదని జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును చంద్రబాబు ప్రశ్నించారు. "మీ జిల్లా నేతలు అంత బిజీగా ఉన్నారా?...అయితే నాకు పనిలేక సమావేశానికి వచ్చానా?"...అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు సమన్వయ కమిటీ సమావేశానికే రాని వాళ్ళకు పదవులు అవసరమా?...అని చంద్రబాబు అన్నారు.

రాజకీయ నేతలకు పదవి, హోదా పార్టీ వల్లే వస్తుందని...అలాంటి పార్టీ అంటే లెక్కలేకపోతే ఎలా? అని గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును చంద్రబాబు నిలదీశారు. ఈ పరిస్థితిపై గట్టిగా వ్యవహరించాలంటూ జీవీ ఆంజనేయులుకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
అనంతరం సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఇది ఎన్నికల సమయమని...చాలా జాగ్రత్తగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికలలో టీడీపీ గెలవడం చాలా అవసరమని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.
గుంటూరులో మైనార్టీ సదస్సు, ప్రకాశం జిల్లాలో దళిత సదస్సు నిర్వహించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. మంత్రి ఆనందబాబు నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన నేతలంతా కూర్చొని దళిత సదస్సుపై చర్చించాలన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో బీసీల అంశంపై చర్చించాలని, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవా మిత్రలకు పార్లమెంటు వారీగా ఎన్నికల వరకు శిక్షణ శిబిరాలు కొనసాగాలన్నారు. అన్ని కోణాల నుంచి తాను ఫీడ్ తీసుకుంటానని చంద్రబాబు అన్నారు. సీఎంకు ఏమీ తెలియదులే అనే భావన వదిలేయాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడబోనని చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications