జూనియర్, లోకేష్ పోరుకు తాత్కాలిక బ్రేక్ ? చంద్రబాబుకు కొత్త చిక్కు! త్యాగాలు తప్పవా ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ సాయం లేకపోతే ఎన్నికల నావ ఈదడం కష్టమనే అంచనాకు చంద్రబాబు వచ్చేస్తున్నారు. ఈ సమయంలో గతంలో తమ పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ వాడుకోవాలనుకుంటోంది. అందుకు అంగీకరిస్తేనే పొత్తు అంటూ షరతులు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే చంద్రబాబు ఇప్పుడు త్యాగాలకు సిద్ధమవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.
Recommended Video
జూనియర్ ఎన్టీఆర్- టీడీపీ
సీనియర్ ఎన్టీఆర్ స్ధాపించిన టీడీపీ జవసత్వాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో దానికి తిరిగి ప్రాణం పోయాలంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరం కనిపిస్తోంది. 2009 ఎన్నికల సమయంలో మహాకూటమిగా ఏర్పడిన టీడీపీ-టీఆర్ఎస్-కమ్యూనిస్టుల త్రయానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసి పెట్టారు. అయినా వైఎస్సార్ హవా ముందు నిలవలేకపోయారు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రచార శైలి మాత్రం ఆకట్టుకుంది. ఆ తర్వాత చంద్రబాబు వ్యూహాత్మకంగా జూనియర్ ను తన కుమారుడు లోకేష్ కోసం పక్కనబెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో తిరిగి జూనియర్ ఎన్టీఆర్ అడుగుపెడితే టీడీపీకి పూర్వవైభవం వస్తుందనే ఆశలు టీడీపీ అభిమానుల్లో ఇప్పటికీ ఉన్నాయి.
జూనియర్-అమిత్ షా భేటీ
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలని, వీలైతే పగ్గాలు కూడా ఇవ్వాలనే డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి అక్కడక్కడా వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కీలక నేత అమిత్ షా హైదరాబాద్ లో ఆయన్ను విందుకు ఆహ్వానించారు. దీంతో జూనియర్ కూడా వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు.
అయితే రాజకీయంగా ఏమాత్రం యాక్టివ్ గా లేని జూనియర్ ను అమిత్ షా ఎందుకు పిలిచారనే చర్చ తీవ్రంగా జరిగింది. దీనికి సమాధానంగా వీరిద్దరి భేటీ తెలంగాణ ఎన్నికల కోసమేననేది దాదాపుగా తేలిపోయింది. దీంతో ఈ భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నట్లు తెలుస్తోంది.
లోకేష్-జూనియర్ పోటీకి బ్రేక్?
తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు అమిత్ షా తో జరిగిన భేటీలో జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసిపెట్టమని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి జూనియర్ కూడా సరేనన్నట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ-బీజేపీ కూటమి తరఫున జూనియర్ ప్రచారానికి దిగితే ఇప్పటివరకూ టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలు కాస్తా బయటికి వచ్చేస్తాయి. అంతే కాదు నారా లోకేష్ కూడా ఇరుకునపడతారు. అలా జరక్కుండా ఉండేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్, జూనియర్ మధ్య పోరుకు తాత్కాలికంగా బ్రేక్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
చంద్రబాబు తలొగ్గాల్సిందేనా?
తన కుమారుడు లోకేష్ కోసం 2019 నుంచి ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనబెడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం త్యాగం చేయక తప్పని పరిస్ధితి ఎదురుకానుంది. అమిత్ షా కోరుకున్నట్లు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమి కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి దిగాలంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి.
అయితే బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్న చంద్రబాబు.. ఈ ఆఫర్ కు ఒప్పుకుని జూనియర్ ను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. దీని ప్రభావం భవిష్యత్తులో టీడీపీపై ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు కాదంటే మాత్రం అమిత్ షా ఆగ్రహానికి గురి కాక తప్పదు. దీంతో చంద్రబాబు ఆ మేరకు తన కుమారుడు లోకేష్ ను పణంగా పెట్టి త్యాగానికి సిద్ధం కావాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది.