బీహార్ ఫలితాల తర్వాత మోదీని ఆకాశానికెత్తేసిన చంద్రబాబు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులని విజయాన్ని అందుకుంది.. జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి. 202 సీట్లతో విజయదుందుభి మోగించింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి మట్టికరిచింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 35 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ- 91, జేడీయూ- 81 స్థానాల్లో గెలిచాయి. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా అయిదోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీహార్ ఫలితాలపై..
తాజాగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై ఏపీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే సరైన రాజకీయమని, దీన్ని బీహార్ ఫలితాలు మరోసారి నిరూపించాయని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్డీఏ ఇదే ఫార్ములాను అనుసరిస్తోందని, ఈ విషయంలో మోదీ నాయకత్వం ఓ కొత్త బెంచ్ మార్క్ ను సృష్టించిందని చెప్పారు.

మోదీకి బాగా తెలుసు..
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా సాధికారత సాధించవచ్చనే విషయాన్ని బీహార్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని చంద్రబాబు పేర్కొన్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మోదీ నిలకడగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తోన్నారని చెప్పారు. ప్రజలతో ఎలా సంభాషించాలో, దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో, ఎలా పని చేయాలో ఆయనకు బాగా తెలుసునని కితాబిచ్చారు.
నితీష్ కుమార్ పాలన బాగుంది..
ఈ విజయంలో నితీష్ కుమార్ పాత్ర గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అనుసరించిన అనుకూల విధానాలు, పాలనను కూడా ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. బీహార్ ఒకప్పుడు జంగిల్ రాజ్ అని అందరికీ తెలుసునని, దానికి నితీష్ కుమార్ ముగింపు పలికారని చెప్పారు. రాష్ట్రంలో నితీష్ కుమార్, కేంద్రంలో నరేంద్ర మోదీ పరిపాలనకు ఈ ఎన్నికలు సమగ్ర ఆమోదం తెలిపాయని చెప్పారు.
ఊహాజనిత ప్రశ్నలు..
మహారాష్ట్ర తర్వాత బీహార్లో అసెంబ్లీల్లో బీజేపీ బలం పెరగడం వల్ల ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యుల పాత్ర తగ్గుతుందా అనే ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు. అలాంటి పరిస్థితి రాబోదని తేల్చి చెప్పారు. అవన్నీ కూడా ఊహాజనిత ప్రశ్నలని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని ఎన్డీఏ ఐక్యతకు అద్దం పట్టిందని పేర్కొన్నారు. ఎన్డీఏలో తెలుగుదేశానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదని అన్నారు.
మోదీని విమర్శించడంపై
2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం, ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించడం, అప్పట్లో ఆయనతో సన్నిహిత సంబంధాలు లేకపోవడం వంటి అంశాలను చంద్రబాబు తోసిపుచ్చారు. మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వాటిపట్ల తాను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. దేశానికి మోదీ వంటి నాయకులు కావాలని, తాను నిజంగా ఆయనను అభినందిస్తున్నానని అన్నారు. గతంలో ఉన్న విభేదాలు ఇప్పుడు తొలగిపోయాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ మోదీతో వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ లేవని చెప్పారు. అని బదులిచ్చారు.
మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారు..
ఇప్పుడు ప్రజలు మోదీ నాయకత్వాన్ని నమ్ముతున్నారని, సంక్షేమం, అభివృద్ధి, సుస్థిరమైన పాలన, సుపరిపాలన ద్వారా సాధికారత అనే కొత్త మోడల్ ను ఆయన సృష్టించారని అన్నారు. 12 సంవత్సరాల క్రితం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం కొనసాగుతున్నందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications