నిధులు రాకుండా అడ్డుకట్ట: వైసీపీ కుట్రపై బాబు ఫైర్
అమరావతి: రాష్ట్రాభివృద్దికి నిధులు రాకుండా వైసీపీ అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.ఇంటింటికి కరపత్రాలు ప్రచురించి వైసీపీ కుట్రలను బట్టబయలు చేయాలని ఆయన పార్టీ నేతలకు సలహ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నేతలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో వైసీపీ విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్దిపథంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను వైసీపీ అడ్డుకొంటుందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రజలకు అర్ధమయ్యేలా ప్రచారం చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
నిధులను అడ్డుకొంటున్న వైసీపీ
''కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వీలైనన్ని పథకాల ద్వారా నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ... వైసీపీ ఎంపీలు కుట్రపూరితంగా ఫిర్యాదులు చేసి ఆ నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్దిపథంలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోంటే విపక్షంగా సహకరించకుండా అడ్డుపడడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఉపాధి హమీ నిధులు రాకుండా వైసీపీ అడ్డుకొంది
పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఆ నిధులు రాకుండా నిలిపివేయించారని తెలిపారు. '' పేదలకు కూలీ డబ్బులు అందడం కూడా వీరికి ఇష్టం లేదు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి నష్టం కలిగేలా ఏనాడూ వ్యవహరించలేదు. వైసీపీ ఎంపీల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లండి. పేద కూలీలకు మరింత వివరంగా చెప్పండి. వైసీపీ దుర్మార్గ పోకడలను ఊరూరా చాటండి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
నాలుగు నెలలుగా ఉపాధి కూలీలకు రాని అందని వేతనాలు
బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు మూడు నాలుగు నెలలుగా డబ్బులు రావడం లేదని, గ్రామాలకు వెళ్లినప్పుడు వారు దీని గురించి ఫిర్యాదు చేస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు టెలికాన్పరెన్స్లో చెప్పారు. దీనికి చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు.
వైసీపీ లేఖలను కరపత్రాలుగా పంచాలి
వైసీపీ ఎంపీలు రాసిన లేఖల సారాంశాన్ని వీడియో కాన్ఫరెన్స్లో చదివి వినిపించారు. ఈ లేఖలనే కరపత్రాలుగా ఊరూరా పంచాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఉపాధి హామీ నిధులను గరిష్ఠంగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో అందరి కన్నూ మనమీదే ఉందని చంద్రబాబు అన్నారు.రాష్ట్ర వాటా నిధులతో కలిపి సుమారు 8 వేల కోట్ల విలువైన పనులు చేస్తున్నామన్నారు. . దీంతో అందరి కళ్లూ మనపైనే ఉన్నాయి. కేంద్ర అధికారులు కూడా ఒక కన్నేసి ఉంచారు. మీరందరూ ఈ పథకం కింద పనుల్లో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.