రాజకీయాల్లో మార్పు తెద్దాం రండి..! వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే !! : చంద్రబాబు కీలక ప్రకటన
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ అదినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని బలపర్చాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల్లో ప్రజలపై ఉందన్నారు. సామాన్యుల కష్టాలు తీరాలన్న, పేదరికం పోవాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందని నొక్కి చెప్పారు. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. బడుగు , బలహాన వర్గాలకు అండగా ఉండేది టీడీపీ పార్టీయేనని స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన వ్యక్తీ ఎన్టీఆర్ అని అన్నారు.

యువతకు 40 శాతం సీట్లు
సమాజ హితం కోసం యువత రాజకీయాల్లో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువతరం పోరాడితే ఏదైనా సాధ్యమన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అదికారంలోకి రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40శాతం టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జగన్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని పేర్కొన్నారు.

తెలంగాణపై ఫోకస్ పెడతా..
బీసీలకు , మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీదే అని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని కొనియాడారు. ఒక రాజకీయ పార్టీగా 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం అరుదైన ఘటన అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన టీడీపీ ఉందన్నారు. తెలంగాణలో పార్టీపై ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు. విలువతో కూడిన పార్టీ టీడీపీ అని చెప్పారు. క్రమశిక్షణకు పెట్టింది పేరు పార్టీ కార్యకర్తలు, నేతలు అని కొనియాడారు. ఏపీలో విధ్వంసకర పాలనను సాగనంపేందుకు ప్రజలు నడుంబిగించాలన్నారు. ఏపీలో వ్యవసాయ మోటర్లుకు మీటర్లు అంతే రైతులకు ఉరితాడే గతి అని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఏపీ రాజధాని అమరావతియే..
ఏపీలో రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా 33 వేల ఎకరాలు భూములిచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా చేసిందని మండిపడ్డారు. అమరావతిలో ఇన్ సైడ్ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిందన్నారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. తనపై నమ్మకంతో రాజధాని కోసం తమ భూములను రైతులు త్యాగం చేశారని చెప్పారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతియే అని.. ఇదే విషయాన్ని కోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications