ఇక ముందు విజయవాడ నుంచే: చంద్రబాబు
విజయవాడ: కొత్త రాజధానిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిడి పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్తగిరి పేరుతోనే కొనసాగిస్తామని చెప్పారు.
విజయవాడ-గుంటూరు మధ్యే ఏపి రాజధానికి అనువైన వాతావరణం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ నుంచే పని చేయాల్సి ఉంటుందని అన్నారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలిలను కలిపి మెగాసిటీ నిర్మిస్తామని ఆయన అన్నారు.
కొత్త రాజధాని ప్రజారాజధానిగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అందరం మారాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి వికేంద్రీకరణ చేపడుతున్నామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మేకింగ్ ఇండియా నినాదాన్ని మనం మేకిన్ ఆంధ్రప్రదేశ్గా చేపడతామన్నారు. సంచలనాలు కాదు, విశ్వసనీయ వార్తలను అందించాలని ఈ సందర్భంగా మీడియాను కోరారు. దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని దూరదృష్టితో పని చేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 2 నుంచి రూ. 1000 వృద్ధాప్య పింఛన్లు అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ తదితరలు పాల్గొన్నారు.