బీజేపీకి చంద్రబాబు ఆఫర్ చేసిన సీట్లు ఇవేనా ? అమిత్ షాకు కావాల్సిందీ ఇదే..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీ మాజీ మిత్రపక్షం టీడీపీ ఎప్పటినుంచో తహతహలాడుతోంది. గతంలో 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన టీడీపీ.. అప్పటి నుంచి బీజేపీపై కత్తులు నూరింది. అయితే 2019 ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. దీంతో తాజాగా ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు ఐదేళ్ల విరామం తర్వాత భేటీ అయ్యారు.
అమిత్ షా తో భేటీలో ముందు తెలంగాణలో ఆ తర్వాత ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకునేలా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం సాయం చేయబోతున్న టీడీపీ.. ఏపీలో మాత్రం తమ గెలుపుకు సాయం చేయాలని బీజేపీని కోరుతోంది. దీనికి ప్రతిగా కేంద్రంలో అవసరమైన ఎంపీ సీట్లు ఏపీ నుంచి ఇచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ఏయో ఎంపీ సీట్లను బీజేపీకి కేటాయించబోతోందో ఓ ఆఫర్ చంద్రబాబు అమిత్ షాకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఏపీలో బీజేపీకి 8 నుంచి 10 ఎంపీ సీట్లలో, అలాగే 12 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసేందుకు టీడీపీ కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సీట్లను వారికి కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లలో టీడీపీ, జనసేన పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు, సీట్ల పంపకాలపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
అమిత్ షాకు చంద్రబాబు ఇచ్చారని చెబుతున్న ఆఫర్ లో ఎంపీ సీట్లు చూసుకుంటే విజయవాడ నుంచి సుజనా చౌదరి, వైజాగ్ నుంచి పురంధేశ్వరి, కడప నుంచి ఆదినారాయణరెడ్డి, రాజంపేట నుంచి సీఎం రమేష్, కర్నూలు నుంచి టీజీ వెంకటేష్, ఏలూరు నుంచి కామినేని శ్రీనివాస్, నెల్లూరు నుంచి సత్యకుమార్, నరసరావుపేట నుంచి జీవీఎల్ నరసింహారావు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 12 ఎమ్మెల్యే సీట్లలోనూ అభ్యర్ధుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
టీడీపీ బీజేపీకి ఆఫర్ చేస్తున్న ఎమ్మెల్యే సీట్లలో ధర్మవరం నుంచి వరదాపురం సూరి, కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రెడ్డి, తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి, గుంటూరు పశ్చిమ నుంచి సాదినేని యామిని, రాజంపేట నుంచి రమేష్ నాయుడు, విశాఖ పశ్చిమ నుంచి పీవీఎన్ మాధవ్, విజయవాడ వెస్ట్ నుంచి ఎస్కే బాజీ,నెల్లూరు సిటీ నుంచి ఆంజనేయరెడ్డి, ఆముదాల వలస నుంచి పూడి తిరుపతిరావు, రాజమండ్రి సిటీ నుంచి సోము వీర్రాజు, గన్నవరం నుంచి లంకా దినకర్ పేర్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications