మురళీ మోహన్కు బాబు తీపి కబురు: అమరావతిపై సీఎం చెప్పిన వాటికి కేంద్రం ఓకే
అమరావతి: ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగు రోజులకు ఒకసారి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ బుధవారం నాడు చెప్పారు.
ఇటీవల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ నిలిపేయడంతో కొవ్వూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. దీనిపై మంగళవారం నాడు స్థానిక టిడిపి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.
నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వారు చంద్రబాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను, ఇరిగేషన్ శాఖ అధికారులు ఆదేశించారని మురళీ మోహన్ చెప్పారు.
అదనపు జలాల కోసం ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, అవి వస్తే ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. రైతులు నష్టపోకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మురళీ మోహన్ చెప్పారు.
ఏపీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాంతీయ కార్యాలయానికి ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్రానికి కేంద్రం సమాచారమందించింది.
అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ తయారు చేసేందుకు కేంద్రం ఆమోద ముద్రవేసింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది. చిలకలూరిపేటకు బైపాస్ హైవే ఏర్పాటుపై డీపీఆర్ తయారు చేసేందుకు కేంద్రం కన్సల్టెన్సీని నియమించింది. జులై నాటికి నివేదిక అందజేయాలని కన్సల్టెన్సీకి ఆదేశించింది.