ఓ కెరటం పుడుతుంది బాబు బంగాళాఖాతంలోకే, ఇంగ్లీష్లో తిట్టలేడు: జగన్
మంగళగిరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం సమర దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సంవత్సరం కింద ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని చూడాలంటూ వీడియోలుగా చూపించారు.
ఎల్సీడీ స్క్రీన్ పైన బాబు హామీలు, నాడు టీవీల్లో వచ్చిన ప్రకటలను చూపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తుందేమిటని ప్రశ్నించారు. నాడు చిక్కటి చిరునవ్వుతో ఎంతో చేస్తానని చెప్పారన్నారు.
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి, యాధృచ్ఛికంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లాలో తాను హామీలు నెరవేర్చడం కష్టమని ఇప్పుడు చెబుతున్నారన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పారని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్రలకు మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.

అనంతరం ఏప్రిల్ నెలలో తాను అన్ని హామీలు నెరవేరుస్తానని ఈసీకి లేఖ రాశారని చెప్పారు. ఎన్నికలయ్యాక, ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులతో నాకేం పని అని ఇప్పుడు ప్లేటు మార్చారన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహాంపై
చంద్రబాబు ఒక్కసారి తన సెక్యూరిటీని పక్కన పెట్టి గ్రామాల్లో తిరిగితే, ప్రజలు రాళ్లతో కొట్టడం ఖాయమన్నారు. ఒక్క అబద్దాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఎన్నో అబద్దాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రూ.50 లక్షల లంచం ఇస్తూ పట్టుబడ్డాడని చెప్పారు.
రేవంత్ ఓటుకు నోటు వ్యవహారంలో తమ బాస్ పేరు చెప్పారని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలోని ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇచ్చే ప్రయత్నం చేశారని, అలాంటప్పుడు 18 మంది ఎమ్మెల్యేలకు రూ.90 కోట్లు కావాలని, వాటిని ఎక్కడి నుండి తెచ్చారన్నారు.
తెలంగాణలో అక్కడ పట్టుబడిన మరుసటి రోజే విజయవాడలో చంద్రబాబు అవినీతిరహిత రాష్ట్రంగా ప్రమాణం చేయంచడం విడ్డూరమన్నారు. ఓ పక్క అవినీతికి పాల్పడుతూ, మరోపక్క అవినీతిరహితం అనడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అన్నారు.
ప్రత్యేక హోదా తేవాలని చెప్పినా
ఏపీకి ప్రత్యేక హోదా తేవాలని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇంగ్లీష్లో, హిందీలో ఆయన తిట్టడం లేదన్నారు. బాబుకు ఇంగ్లీష్ వస్తుందని, అయితే అలా తిడితే మోడీకి తెలుస్తుందని ఆయన తిట్టడం లేదన్నారు.
ఇద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారని, అయినా ప్రత్యేక హోదా తేవడం లేదన్నారు. కేంద్రం హోదా ఇవ్వనప్పుడు కేంద్రమంత్రివర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎందుకన్నారు.
రాజధానిపై..
తాను రాజును అని చంద్రబాబు రాజధాని విషయంలో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాదులోని బాబు ఇంటికి, స్థలాలకు ఏం కాకూడదని కానీ, రాజధాని కోసం రైతుల భూములు మాత్రం లాక్కుంటారన్నారు. రైతుల నుండి భూములు లాక్కోవడం సరికాదన్నారు.
చంద్రబాబు మెడలు వంచైనా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టేలా చేస్తామన్నారు. నాడు ప్రజల చెవిల్లో క్యాలీఫవర్లు పెట్టి ముఖ్యమంత్రి సీటు ఎక్కారన్నారు. చంద్రబాబు అధికారంలో రెండేళ్లుంటారో లేక మూడేళ్లుంటారో కానీ వచ్చేది మాత్రం తామేనన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇస్తామని చెప్పారు. ఈసారి చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావన్నారు. ప్రజల నుండి ఓ కెరటం పుడుతుందని, దానికి చంద్రబాబు బంగాళాఖాతంలో కలుస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications