ఈశ్వరన్కు శ్రీవారి ప్రసాదం, సింగపూర్లో దిగగానే బాబు బిజినెస్, అమరావతిపై మలేసియా ఆసక్తి
సింగపూర్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన సింగపూర్ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్తో భేటీ అయ్యారు. ఈశ్వరన్కు చంద్రబాబు శాలువా కప్పి, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
వారు రాజధాని అభివృద్ధిపై చర్చించారు. కాగా, సాయంత్రం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఏఎస్)లో చంద్రబాబు కీలకోపన్యాసం చేయనున్నారు. సింగపూర్లో భారత రాయబారి గోపీనాథ్ పిళ్త్లె సంధానకర్తగా వ్యవహరిస్తారు.
అనంతరం సింగపూర్ కన్సార్టియం ఇచ్చే విందుకు హాజరవుతారు. మంగళవారం కూడా పలు కంపెనీలతో సమావేశం ఉంటుంది. టౌన్షిప్లను సందర్శిస్తారు. బుధవారం నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. స్వచ్ఛభారత్కు సంబంధించిన నివేదిక రూపకల్పనలో పాల్గొంటారు.

అమరావతి నిర్మాణంపై మలేసియా ఆసక్తి
సీఎం చంద్రబాబు ఆదివారం సింగపూర్ చేరుకోవడంతోనే పెట్టుబడుల ఆకర్షణ దిశగా పని ప్రారంభించారు. విమానాశ్రయం నుంచే నేరుగా సింగపూర్లోని షాంగ్రిలా హోటల్కు చేరుకుని అక్కడ మలేసియాకు చెందిన అతిపెద్ద పట్టణాభివృద్ధి కంపెనీ అయిన ఇస్కాండర్ మలేసియా ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.
రాజధాని ప్రాంత అభివృద్ధిలో తమకున్న అనుభవాలను ఆ కంపెనీ ప్రతినిధులు దృశ్య రూపంలో వివరించారు. మలేషియాలో ఐదు ప్రధాన జోన్లలో మౌలిక వసతుల కల్పన కోసం ఆ కంపెనీ 300 మిలియన్ డాలర్లను వెచ్చించింది.
మలేసియా దేశంలోని మెడిని అనే ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ ప్రత్యేకంగా ఇస్కాండర్ మెడిని డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ అథారిటీలో ఇస్కాండర్ కంపెనీతో పాటు మలేసియా, అబుదాబి ప్రభుత్వాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
మెడిని ప్రాంతాన్ని తాము ఎలా అభివృద్ధి చేశామన్న దానిపై ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఏపీ రాజధాని అమరావతిలో కూడా అదే తరహాలో అభివృద్ధి చేయడంపై వారు ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించారు.
మౌలిక వసతుల కల్పన, పెట్టుబడిదారులకు ప్లగ్ అండ్ ప్లే వాతావరణం కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి నగర అభివృద్ధిపై తన ఆలోచనలను వారికి వివరించారు. అంతర్జాతీయ రాజధాని నగరంగా అమరావతిని రూపొందించేందుకు చేస్తున్న కృషిని వారితో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications