కాంగ్రెస్తో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్-పవన్ కళ్యాణ్లపై ఆగ్రహం
అమరావతి: పవన్ కళ్యాణ్, కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు బీజేపీకి లబ్ధి చేకూరేలా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. బీసీలకు పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు అన్నారు. బీసీలకు తాము రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బీసీల్లో నాయకత్వం ఎదగకపోతే సమస్యలు పెరిగిపోతాయని చెప్పారు.
బీజేపీ చేసిన నమ్మకద్రోహానికి 40 ఏళ్ల పాటు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో జతకలసి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పార్టీతో జతకలవడంపై చంద్రబాబు లోలోన కుమిలిపోతున్నారా అనే చర్చ సాగుతోంది.
ఆయన ఇంకా మాట్లాడుతూ... అందరూ ఈర్ష్యపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతి ద్వారా ఆదాయం వస్తుందని, దీని ద్వారా అప్పులు తీరుస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని నేను అంత తేలిగ్గా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వడ్డీతో సహా వసులు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
ఆ ముగ్గురికి నన్ను తిట్టడమే పని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముగ్గురు కూడా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమే ముగ్గురి విధానంగా కనిపిస్తోందని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ఏమయ్యాడో తెలియదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే తాను ఢిల్లీకి వస్తానని, అందరి మద్దతు కూడగడతానని చెప్పారని కానీ, తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాక పవన్ కళ్యాణ్ ఏమైపోయాడో ఎవరికీ తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు అన్నీ వికటించాయని చెప్పారు.
నేను కష్టపడుతుంటే కేసీఆర్ నిందిస్తున్నారు
తాను అహర్నిషలు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తుంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను నిందిస్తున్నారని చంద్రబాబు వాపోయారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్కే తెలియదని చెప్పారు. మరో ఆరేడు నెలల సమయం ఉన్నప్పటికీ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో ఆయన సమాధానం చెప్పాలన్నారు.
ఒక్క ఐడియాతోనే అద్భుతం
అమరావతిలో రైతులు తనను నమ్మి భూములు అప్పగించారని చంద్రబాబు అన్నారు. మీ భూములు నాకు ఇవ్వండి, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దాని కంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం చూపిస్తానని రైతులకు చెప్పానని, వారు సంతోషంగా అంగీకరించారని చెప్పారు. అమరావతికి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేవలం ఓ ఐడియాతోనే ఈ అద్భుతం సాధ్యమయిందన్నారు. 35,000 ఎకరాలను సేకరించగలిగామన్నారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల విలువ అప్పట్లోనే రూ.40,000-50,000 కోట్లు ఉండేదని, ఇందులో 20-30 శాతం భూమిని రైతులకు తిరిగి ఇచ్చామని చెప్పారు. అమరావతిలో ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అత్యాధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్, నీళ్లు, వరద ప్రవాహం వ్యవస్థలను భూగర్భంలో నిర్మిస్తున్నామన్నారు. ఏపీలో పరిపాలన భవనం 1650 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, ఇలాంటి వసతి ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఏపీలో మిగతా ప్రాంతాలకు ఎలాంటి నష్టం లేకుండా ముందుచూపుతో రాయలసీమకు సాగు, తాగునీటిని అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏ రాష్ట్రంలోను అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రజల ఇబ్బందులను ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 30న రాజమహేంద్రవరం భారీ ఎత్తున జయహో బీసీ సభను టీడీపీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.