బెజవాడ బాగాలేదు: అమరావతి పూర్తయ్యే వరకూ అక్కడ నుంచేనన్న చంద్రబాబు
విజయవాడ: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం పూర్తయ్యే వరకు విజయవాడ నుంచే తన పరిపాలన సాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గడచిన 16 మాసాలుగా రాజధాని కేంద్రంగా విజయవాడ పేరు మార్మోగుతున్నా, సీఎం క్యాంపు కార్యాలయం నగరంలోనే ఉన్నా బెజవాడకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో విజయవాడపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడను ఉన్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు.
ఆదివారం తన నివాసంలో సంబంధిత మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధానిస్థాయి నగరంగా విజయవాడను ఏవిధంగా తీర్చిదిద్దాలో సమాలోచనలు సాగించారు. ముందుగా నగరంలో 40.63 కిలోమీటర్ల నిడివివున్న 14 రహదారులను రూ. 93.32 కోట్లతో అత్యుత్తమ రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. తక్షణమే రహదారులు, ప్రజా చైతన్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రతి రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు, డివైడర్లు, గ్రీనరీ, వీధి దీపాలు, విద్యుత్ వైరింగ్ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలో 7.5 కిలోమీటర్లమేర కృష్ణానదీ తీరం వెంబడివున్న కాలవ గట్లపై ఆక్రమణలు లేకుండా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడేలా సుందరీకరణ చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా సక్రమంగా ప్రవహించేలా డ్రెయిన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సీవరేజి, వాటర్ ట్రీట్మెంట్ విషయాల్లో ఆధునిక పద్ధతులు అనుసరించాలన్నారు. ముఖ్యంగా మురుగునీరు ప్రధాన కాల్వల్లో కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగర రహదారులపై ఎక్కడా గుంతలులేకుండా చూసుకుంటూ ఎప్పటికప్పుడు నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. నగరంలోని 54 ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సెన్సర్ డ్రివెన్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్న పోలీస్ శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రోడ్డు డివైడర్లను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు.
ఇక నగరంలో తరచూ ఆకస్మిక తనిఖీలు చేపడతానని, ఎక్కడ ఎలాంటి తేడావచ్చినా ఏ ఒక్కరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను వినియోగించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులకు అదనపు నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నగరంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు నైట్ షెల్టర్లకు అదనంగా మరో నాలుగు షెల్టర్లను ఏర్పాటుచేసి వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు.
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలని, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నగరంలోని అన్ని పార్కులను, కమ్యూనిటీ హాళ్లను ఆధునీకరించాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి, మున్సిపల్, కరెంట్, వాటర్, ఇతర శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ నిర్ణీత కాలవ్యవధిలో విజయవాడ నగరాన్ని రాజధానిస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
విజయవాడ నగర సుందరీకరణ కోసం ఇప్పటికే బ్లూ అండ్ గ్రీన్ అంతర్జాతీయ సంస్థకు ప్రణాళిక తయారీ బాధ్యతను అప్పగించామన్నారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవల్లన్, కృష్ణా కలెక్టర్ బాబు.ఎ, సిఆర్డిఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్, సిఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్చంద్ర, మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications