కొత్త ఛాంబర్లోకి బాబు: తొలి సంతకం, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, ప్రత్యేకతలివే
అమరావతి: ఇక నుంచి అమరావతి కేంద్రంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తన కార్యకలాపాలు కొనసాగంచనున్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఛాంబర్ను బుధవారం ప్రారంభించారు.
ముందుగా నిర్ణయించిన 8:09 గంటల ముహూర్తానికి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాంఛనంగా కొత్త ఛాంబర్లోకి అగుడు పెట్టారు. అనంతరం అక్కడ గణపతి పూజ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, సీఎస్ టక్కర్, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తన ఛాంబర్లోకి ప్రవేశించిన చంద్రబాబు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలో ఒకటైన డ్వాక్రా మహిళల రుణ మాఫీ ఫైలుపై సంతకం చేశారు.
తొలి సంతకం డ్వాక్రా మహిళల రుణమాఫీపై
ముఖ్యమంత్రి కొత్త ఛాంబర్లోకి అడుగు పెట్టిన తర్వాత డ్యాష్ బోర్డు ద్వారా ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ఇది రెండో విడత రుణ మాఫీ ఫైలని ఆయన పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని తెలిపారు. హైదరాబాద్లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు.
Happy to share that we have inaugurated the CM Office at Velagapudi today. As promised, it is 'Prajala Vaddaku Palana'.
— N Chandrababu Naidu (@ncbn) October 12, 2016
అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదన్నారు. కాగా ముఖ్యమంత్రి చాంబర్ను అత్యంత పటిష్టంగా, అత్యాధునిక వసతులతో నిర్మించారు. సీఎం కార్యాలయ భవనాన్ని అత్యంత పటిష్టంగా, రక్షణాత్మకంగా నిర్మించారు. రాకెట్ లాంచర్లతో దాడిచేసినప్పటికీ భవనానికి ఎటువంటి ముప్పు ఉండని రీతిలో నిర్మిస్తున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు
సీఎం భద్రత దృష్ట్యా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మిస్తున్నారు. అయితే చంద్రబాబు సూచనల మేరకు కార్యాలయంలో చిన్నచిన్న మార్పులు చేస్తున్నారు. మొత్తం భవనాన్ని 72/70 మీటర్ల నిష్పత్తిలో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో రెండు అంతస్తులున్నాయి. మొత్తంగా లక్ష చదరపు అడుగుల మేర నిర్మాణం చేపట్టారు.
11 మీటర్లతో 36 గదులు నిర్మించనున్నారు. ఈ భవనంలో ఏడు లిఫ్ట్లున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఓ లిఫ్ట్ కేటాయించారు. కాగా, వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మొత్తం ఆరు భవనాలను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో ఇప్పటికే నాలుగు భవనాలు సిద్ధమయ్యాయి. 2,3,4,5 భవనాల్లో ఇప్పటికే మంత్రులు తమ శాఖలను ప్రారంభించేశారు.
లాంఛనంగా ప్రారంభం కావాల్సిన రెండు భవనాల్లో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, రెండోది అసెంబ్లీతో పాటు శాసనమండలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఆయన కార్యాలయ సిబ్బంది, సీఎస్, సీఎం కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ భవనం, వీడియో కాన్ఫరెన్స్, ఇతర సమావేశ మందిరాలు ఈ భవనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.