ఏపీ చరిత్రలో నిలిచిపోనున్న ఆ పెన్ను, ఫైలు: బాబు జాగ్రత్తలు! ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ పెన్ను, ఫైలుకు సుస్థిర స్థానం లభించింది. ఈ రెండింటినీ జాగ్రత్తగా ఉంచి, మ్యూజియంలో భద్రపరచాలని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించడం గమనార్హం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ పెన్ను, ఫైలుకు సుస్థిర స్థానం లభించింది. ఈ రెండింటినీ జాగ్రత్తగా ఉంచి, మ్యూజియంలో భద్రపరచాలని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించడం గమనార్హం. చంద్రబాబు ఇలా చెప్పడంతో ఆ పెన్ను, ఫైలుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
రాజధాని కోసం..
ఇక ఆ పెన్ను, ఫైలు గురించిన వివరాల్లోకి వెళితే.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డిజైనింగ్, నిర్మాణాల కోసం ఆయన ఎందరితోనో భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు నగరాలను పరిశీలించారు.
ఒప్పందం
ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న సింపూర్ కన్సార్టియమ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీడ్ క్యాపిటల్గా పేరుగాంచిన ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మండం గ్రామాలకు చెందిన 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను సింపూర్ కన్సార్టియం నిర్మించనుంది. ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
ఆ పెన్ను, ఫైలు
కాగా, ఈ ఒప్పందాలకు సంబంధించి సంతకాలు చేసిన తర్వాత... తాను సంతకం చేసిన పెన్నును, ఫైలును సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్కు చంద్రబాబు ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఈ రెండింటికీ గొప్ప స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు వివరంచడం గమానర్హం. అంతేగాక, వీటిని చాలా భద్రంగా దాచి పెట్టాలని, రానున్న రోజుల్లో వీటిని మ్యూజియంలో భద్రపరచాలని సూచించారు.
చరిత్రలో నిలిచిపోతాం
ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్కు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమిను చంద్రబాబు గుర్తుగా ఇచ్చారు. ఈశ్వరన్ కూడా ఓ ప్రతిమను చంద్రబాబుకు కానుకగా ఇచ్చారు. ఈ ప్రతిమను కూడా జాగ్రత్త చేయాలని అజయ్ జైన్కు చంద్రబాబు చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే వాటిని జాగ్రత్తగా కాపాడితే... మనం కూడా చరిత్రలో నిలిచిపోతామని జైన్కు ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం.
అంతగా చెప్పిన తర్వాత..
సమావేశం ముగిసిన తర్వాత కూడా పెన్ను, ఫైలు గురించి జైన్కు చంద్రబాబు మరోసారి గుర్తు చేసి, జాగ్రత్తలు చెప్పారు. ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో ‘మీ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తాం సార్' అని చంద్రబాబుకు అజయ్ జైన్ బదిలిచ్చారు. దీంతో ఆ పెన్ను, ఫైలు కూడా ఏపీ చరిత్రలో నిలిచిపోనున్నాయన్న మాట.