పట్టుతప్పింది: బాబు ఒప్పుకోలు? వైసిపి ఎమ్మెల్యేలకి పోస్ట్లపై కసరత్తు!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలన పైన పట్టు తప్పిందని భావిస్తున్నారా? అంటే అవునని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికగా... విపక్షాలు చెప్పే పత్రికలోనే ఇది రావడం గమనార్హం.
అయితే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారని అందులో పేర్కొంది. పార్టీ పటిష్టంగా ఉంటేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన భావిస్తున్నారని, అందుకే పార్టీపై దృష్టి పెట్టాలని, పాలనపై పట్టు బిగించాలని బాబు భావిస్తున్నారని పేర్కొంది.
సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం, పార్టీ సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావనకు వచ్చాయట. సీఎం చంద్రబాబు కొన్ని అంశాలను బహిరంగంగానే అంగీకరించారని, ఈ సందర్భంగా మంత్రులు కూడా తమ మనోభావాలను నిర్మోహమాటంగా పంచుకున్నారని పేర్కొంది.
2004 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పాలనాదక్షుడిగా, హైదరాబాదును అభివృద్ధి చేసిన నేతగా పేరు తెచ్చుకున్నారని, కానీ ఉద్యోగులలో ఏర్పడిన వ్యతిరేకతతో అధికారం కోల్పోవల్సి వచ్చిందని ఓ మంత్రి వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సవాళ్ల కారణంగా ఈ ఇరవై నెలల్లో పార్టీపై సరిగా దృష్టి పెట్టలేకపోయానని, అదేవిధంగా విజయవాడలో నేను, హైదరాబాదులో ఉద్యోగులు ఉండటంతో పాలన పైన పట్టు తప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది.
జూన్ నాటికి అందరినీ రాజధానికి తరలించి తన మార్క్ పాలన చూపిస్తానని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. ఇదే భేటీలో వైసిపిలో నుంచి టిడిపిలోకి వచ్చే ఎమ్మెల్యే విషయమై చంద్రబాబు ప్రస్తావించారని తెలుస్తోంది. కాగా, టిడిపిలోకి వైసిపి నుంచి దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు వస్తున్నందున వారికి ఇవ్వాల్సిన పదవుల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.