పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: ఎన్టీఆర్ను చంద్రబాబు చేరదీస్తున్నారా?
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ను చేరదీస్తున్నారనే విషయం చర్చనీయాశంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలంటూ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం పుష్కరాలకు ఎన్టీఆర్ను ఆహ్వానించడంపై ఏపీలో పెద్ద చర్చకు తెరలేపింది. పుష్కరాలకు మంత్రి పల్లె తనంతట తానుగా ఎన్టీఆర్ను ఆహ్వానించారని అనుకోవడానికి వీల్లేదు. చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పబట్టే ఎన్టీఆర్ను పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లారనే వాదన వినిపిస్తోంది.
చాలా కాలంగా ఎన్టీఆర్ను దూరం పెడుతూ వచ్చిన చంద్రబాబు కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయనే ఉహాగానాలు చెలరేగుతున్నాయి. తిరుపతిలో జరిగిన టీడీపీ పసుపు పండుగ మహానాడు కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ను ఆహ్వానించలేదు.
రెండు మూడు సార్లు చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలకృష్ణ జూనియర్కు వ్యతిరేకంగా స్పందించిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సయోధ్య సాధ్యమవుతుందా అనేది ప్రశ్నగా ఉంది.
కృష్ణా పుష్కరాలు: ఎన్టీఆర్కు చంద్రబాబు ప్రభుత్వ ఆహ్వానం (ఫోటోలు)
మరోవైపు ఏపీకి ప్రత్యేకోహోదా విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రధానాంశంగా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంది. హోదాపై జగన్ కూడా ఒత్తిడి పెంచుతున్న క్రమంలో ప్రజాకర్షణ గల ఎన్టీఆర్ అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాలకృష్ణకు తోడుగా ఎన్టీఆర్ టీడీపీకి మద్దతు ఇస్తే ప్రజల్ని ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ను చంద్రబాబు దగ్గర చేసుకోవాలని ఉహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే నారా లోకేశ్ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన ప్రస్తుతం తరుణంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది తెలియడం లేదు.
శుక్రవారం ఎన్టీఆర్ పుష్కరాలకు చంద్రబాబు బాలయ్యలతో కలుస్తారా? లేదా అనే ఆసక్తి చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ పుష్కరాలకు హాజరైతే అసలైన పండుగ వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి గురువారం విజయవాడ చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం దగ్గర జరగనున్న హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రాబబుతో కలిసి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు పుష్కరస్నానం ఆచరించనున్నారు.