దేశంలోనే తొలి పోలీస్స్టేషన్ ఏపీలో: నేతలు, రౌడీలకు హెచ్చరిక, జగన్కు చురక
ఇకపై ఏపీలో ఇన్విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ తక్కువగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
గుంటూరు: ఇకపై ఏపీలో ఇన్విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ తక్కువగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుంటూరు నగరంలోని నగరంపాలెంలో ఏర్పాటుచేసిన మోడల్ పోలీస్స్టేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించారు.
దేశంలోనే తొలిసారిగాప్రస్తుత ఆధునిక, సాంకేతిక యుగానికి అనుగుణంగా నూతన విధానాలతో ఈ (మోడల్)పోలీస్స్టేషన్ను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలని, పోలీస్ స్టేషన్కు వచ్చేవారిపై విసుక్కోవద్దని సూచించారు. రౌడీ షీటర్ల ఫోటోల ఆన్లైన్లో పెట్టాలని, తప్పు చేసినవాళ్లను జైలుకు పంపితే నేరాల సంఖ్య తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పోలీసులు దురుసుగా మాట్లాడితే చెల్లుబాటు కాదని, రాజకీయ నేతలు పోలీసులను బెదిరిస్తుంటారని.. కెమెరాల్లో అంతా రికార్డు అవుతుందని, వారికి శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.

రౌడీ అనేవాడు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదని, ముఠా కక్షలు, మత విద్వేషాలు రాష్ట్రంలో జరగడానికి వీల్లేదని అన్నారు. ఆడిపిల్లలు సురక్షితంగా ఉంటారన్న ధీమా తల్లిదండ్రులకు ఇవ్వాలని అన్నారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో కొందరు నేతలు ఏం మాట్టాడారో చూశామని.. సున్నితమైన సమస్యలను జఠిలం చేస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని మండిపడిన చంద్రబాబు... వీటి వల్ల అభివృద్ధి ఆగిపోతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా చురకంటించారు.
ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని జనవరి 26న నిరసనకు పిలుపు ఇచ్చారని.. అవాంఛనీయ సంఘటనలు, ఉగ్రవాదులు ఆ రోజున దాడులు చేస్తే ఎవరికి లాభమో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సమర్థవంతంగా నిలువరించారని చంద్రబాబు కొనియాడారు. అందరం సంతోషంగా ఉందామని, సమాజాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ముందుకు తీసుకువెళదామని చంద్రబాబునాయడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications