జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు, టీడీపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు ఈ వైఫల్యం చంద్రబాబుదేనని వైసీపీ అధినేత వైయస్ జగన్ సహా ఇతర పార్టీలు నిందిస్తున్నాయి. కేంద్రం తీరుపై తాము ఎప్పటికప్పుడు హెచ్చరించామని, టీడీపీ పెడచెవి పెట్టిందని అంటున్నారు.
చదవండి: బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?
మరోవైపు, కారణాలు ఏవైనా కేంద్రం నుంచి టీడీపీ బయటకు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయేలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు డైలమాలో పడ్డారని తెలుస్తోంది. బడ్జెట్పై అసంతృప్తితో బయటకు రావాలని ఉన్నా, తాము బయటకు వస్తే జగన్ దూరిపోతారనే ఆందోళన టీడీపీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మధ్యేమార్గాన్ని అనుసరించనున్నారని తెలుస్తోంది.
చదవండి: బడ్జెట్ దారుణం, అందుకే బీజేపీ ఓడింది: మోడీకి బాబు దెబ్బ, 'అమిత్ షా మాటల్లో ధైర్యం'
సుజనా, అశోక్ల రాజీనామాలు దగ్గర పెట్టుకొని మోడీపై ఒత్తిడి
ఆదివారం (04-02-2018) ఎంపీలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీ కీలకంగా మారింది. చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రం నుంచి బయటకు వస్తారని కొందరు భావించినా.. అంత సాహసం చేసే పరిస్థితి లేదని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం అవసరం, ఒత్తిడి తెచ్చి ఫండ్స్ రాబట్టే ప్రయత్నం, మరోవైపు జగన్ ఇలా పలు కారణాలతో చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల నుంచి రాజీనామా లేఖలు తీసుకొని, వాటిని చంద్రబాబు తన వద్దే ఉంచుకొని, మోడీతో మాట్లాడి ఒత్తిడి పెంచే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.
ఒత్తిడితో బడ్జెట్లో సవరణలు, ప్రత్యేక కేటాయింపులు
ఏపీకి బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ, విమర్శల దాడిని ఇలాగే కొనసాగిస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని తద్వారా బడ్జెట్లో సవరణలు, ప్రత్యేక కేటాయింపులు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఏపీలో ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహావేశాలని ప్రధాని మోడీని కలిసి వివరించనున్నారని తెలుస్తోంది.
ప్రధాని స్పందనను బట్టి
ప్రధాని నరేంద్ర మోడీ స్పందించే తీరును బట్టి ఆ తర్వాత ముందుకు వెళ్లాలని చంద్రబాబుకు కొందరు నేతలు సూచించారని సమాచారం. ఈ ప్రత్యామ్నాయాలపై ఎంపీలతో నేడు జరిగే సమావేశంలో చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కేంద్రమంత్రుల రాజీనామాల తన వద్ద పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా కేటాయింపులు లేకుంటే అప్పుడు ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
జగనే అడ్డు
కేంద్రం నుంచి బయటకు వస్తామంటే చంద్రబాబుకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఉందని అంటున్నారు. అందుకే డైలమాలో ఉన్నారని చెబుతున్నారు. ఏపీలో ఎదగాలనుకుంటున్న బీజేపీ 2019 ఎన్నికలకు ముందు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎన్నికలకు మరో ఏడాదికి పైగా ఉంది. ఇప్పుడు తొందరపడి కేంద్రం నుంచి బయటకు వస్తే, జగన్.. మోడీతో జతకలిస్తే, ఎన్నికలకు ముందు ప్యాకేజీ లాంటి తాయిలాలు ప్రకటిస్తే అనే ఆందోళన టీడీపీలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు డైలమాలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. జగన్కు ఎన్డీయేలో చేరే అవకాశం ఇవ్వవద్దని టీడీపీ భావిస్తోంది. ఒడిదుడుకులు ఎదురైనా 2019లో మోడీ మళ్లీ పగ్గాలు చేపడతారని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.