ఏపీలో బీజేపీ కుట్ర ఇలా: బెంగళూరులో చక్రం తిప్పుతున్న బాబు, మీరే ముందుకు రండి: మమత
బెంగళూరు: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఓ కూటమిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలు వచ్చారు. ఐదు రాష్ట్రాలు సీఎంలు, వివిధ పార్టీ నేతలు హాజరవుతున్నారు.
రాహుల్ గాంధీ, చంద్రబాబు రాక: బెంగళూరు వెళ్లి కేసీఆర్ వెంటనే రావడం వెనుక కారణాలు ఇవీ!
ఈ సందర్భంగా వారు భేటీ అయ్యారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే సూచన చేశారు. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఇతర నేతలు ఏకీభవించారు. బీజేపీయేతర కొత్త ఫ్రంట్ను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.
కేంద్రంపై తాను చేస్తున్న పోరాటాన్ని వివరించిన చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రం తమకు ఎలా అన్యాయం చేసింది, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఎలా పోరాడుతోంది అక్కడకు వచ్చిన ప్రాంతీయ పార్టీల నేతలకు వివరించారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలను, వాటిని ఏ మేరకు నెరవేర్చారు, ఏవి నెరవేర్చలేదని విషయాలను వారికి క్లుప్తంగా వివరించారని తెలుస్తోంది. జీఎస్టీ అమలులో వైఫల్యాన్ని కూడా చెప్పారని సమాచారం. అందుకే తాను కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో కుట్ర రాజకీయాలు
ఏపీలోని పరిణామాలను, బీజేపీకి కుట్ర రాజకీయాలను చంద్రబాబు ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. తమిళనాడులో వలె ఏపీలోను రాజకీయాలకు తెరలేపిందని, దానిని తాము ఎండగడుతున్నామని చెప్పారని సమాచారం. పవన్ కళ్యాణ్, జగన్లను ఉపయోగించుకొని తమను టార్గెట్ చేస్తోందని చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం అడుగుతుంటే ఏపీలో రాజకీయ కుట్రలకు తెరలేపారని చెప్పారని సమాచారం. అయితే, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి తామే మాట్లాడుతున్నామని పవన్, జగన్లు చెబుతున్నారు. మరోవైపు హోదా ఇవ్వమని బీజేపీ ఎప్పుడో చెప్పింది. హోదాపై చంద్రబాబు ఎన్నోసార్లు మాటలు మార్చారు. దీనిపై మాత్రం ఆయన వద్ద సమాధానం లేదనేది ఏపీలోని విపక్షాల మాట.
జాతీయస్థాయిలో ఓ సమావేశం ఏర్పాటు చేయాలి
ప్రాంతీయ పార్టీలు అన్నీ బలోపేతం కావాల్సిన అవసరముందని మమతా బెనర్జీ.. చంద్రబాబుతో అన్నారని తెలుస్తోంది. కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరముందని మాయావతి ప్రస్తావించారని సమాచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది.
ప్రాంతీయ పార్టీలను ముమ్మరం చేసే ప్రయత్నాలు
చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తొలిసారిగా మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరీలతో చంద్రబాబు బెంగళూరులో భేటీ అయ్యారు. కొందరితో విడిగా, కొందరితో కలిసి భేటీ అయిన చంద్రబాబు ప్రాంతీయ పార్టీల బలోపేతంపై ఈ భేటీలో చర్చించారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చంద్రబాబు.. బీజేపీకి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నేను పిలుపిస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసినందుకు థ్యాంక్స్
అంతకుముందు, చంద్రబాబు మాట్లాడుతూ.. తన పిలుపు మేరకు కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీయేతర పక్షాల మద్దతు కోరారు.