కావేరి ఇష్యూ: అప్రమత్తమైన చంద్రబాబు, నీటి కోసం ఘర్షణలు బాధాకరం
అమరావతి: నీటి సంక్షోభం దుప్షలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన నీరు-ప్రగతిపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు.
నీటి కోసం ఘర్షణలకు దారి తీయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదని, నీరు-ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నీటి సంక్షోభాన్ని అధిగమిస్తే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఈ దృష్ట్యా భూగర్భ జలాలను పెంచడం, సమర్థ నీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

ఇందులో భాగంగా ప్రతి మండలంలో పది చెరువుల పునరుద్ధరణ జరగాలని అధికారులకు సూచించారు. భూగర్భజలాల పెంపు, చెరువుల పునరుద్ధరణలో లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నెలాఖరుకు మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 55 నియోజక వర్గాలను బహిరంగ విసర్జనలేని వాటిగా ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications