జగన్తో దేశ ప్రతిష్ట దెబ్బతింది, ఎంత కష్టపడినా..: బీజేపీపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలపై నమ్మకం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సు వివరాలను చంద్రబాబు మంగళవారం అమరావతిలో మీడియాకు వెల్లడించారు. సదస్సు విజయవంతంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.
విశాఖ వేదికగా మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు రాలేదని, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ కొందరు చేస్తోన్న విమర్శలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడులపై తప్పుడు ప్రచారం సరికాదని హెచ్చరించారు.
ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలాదే
తమ ప్రభుత్వానికి సమాజం పట్ల బాధ్యత, జవాబుదారీతనం, విశ్వసనీయత ఉన్నాయని, నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని చంద్రబాబు వివరించారు. అభివృద్ధి జరుగుతుంటే ఇలా అడ్డం పడే వ్యక్తుల్ని తన రాజకీయ జీవితంలో చూడలేదని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం అవగాహన ఉందని.. పెట్టుబడులు రాలేదని అంటున్నారని ప్రశ్నించారు. గతంలో సీఐఐ రెండో భాగస్వామ్య సదస్సు జరిగినప్పుడు జల్లికట్టు ఉద్యమస్ఫూర్తి పేరుతో ఆందోళనలు చేశారని, విజయవాడలో బస్సు ప్రమాదం జరిగితే కలెక్టర్పై బెదిరింపులకు పాల్పడ్డారని సీఎం గుర్తుచేశారు.
వెనక్కి తగ్గబోం
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజనచట్టంలో పేర్కొన్నవన్నీ కేంద్రం ఇవ్వాల్సిందేనని అన్నారు. తప్పించుకొనే ప్రయత్నం చేస్తే మాత్రం సరికాదని తెలిపారు. విభజన హామీలను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ఇందుకోసం సంఘటితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదనడం సరికాదన్నారు.
బీజేపీ నేతలు అలా..
స్వశక్తితో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మన పని మనం చేసుకుంటూనే కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. అనవసరంగా గొడవలు చేస్తే రాష్ట్రానికే నష్టమన్నారు. నిర్మాణాత్మకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులస్తుంటే ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నేతలంటున్నారని చెప్పారు.
జగన్ కారణంగా దేశ ప్రతిష్ట దెబ్బతింది
క్రిమినల్ చరిత్ర ఉన్నవారు, అవినీతిపరులు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో దేశ ప్రతిష్ట దెబ్బతిందని అన్నారు. కయ్యానికి కాలు దువ్వితే తాను కాలు దువ్వాలా? అని చంద్రబాబు అన్నారు. పరిటాల రవిని హత్య చేయిస్తే.. తాను మరొకర్ని హత్య చేయించలేదని అన్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వగలిగాం కాబట్టే కియా మోటార్స్ జిల్లాకు వచ్చిందని విద్యార్థులు గమనించాలన్నారు. కర్నూలు, పులివెందుల, గండికోటకు నీళ్లు ఎవరిచ్చారో అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.
ఇంత కష్టపడుతున్నా..
కేంద్రం రాష్ట్రానికి ఏం చేయడం లేదని పక్కనపడేసి.. బీద అరుపులు అరవలేనని చంద్రబాబు చెప్పారు. డబ్బులు ఇవ్వడం లేదని ఎప్పుడూ కేంద్రాన్ని తిడుతూ ఉండాలా? అని ప్రశ్నించారు. మంచి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నానని చెప్పారు. ఇంత కష్టపడుతున్నా.. తలసరి ఆదాయం పెరగడం లేదని అన్నారు. జాతీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఆ పార్టీల తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే భావన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చని అన్నారు.