కమీషన్ల కోసం కాల్వలు తవ్విన నేతలకు మాట్లాడే అర్హత లేదు: పోలవరంపై బాబు
అమరావతి: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ నేతలేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. గురువారం ఉదయం పోలవరం పనులను డ్రోన్ కెమెరాతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించి సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఇది చంద్రబాబు నిజ స్వరూపం కాదు, స్వార్థ ప్రయోజనాలు ముగిశాక: ఏకేసిన కేవీపీ
ప్రతి ఏడాది వరదలు వస్తున్న కారణంగానే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వరదలు వచ్చి ఆరేడు నెలల పాటు పనులు సాగడం లేదని, 'స్పిల్ వే'లను నిర్మించేందుకు వరదలే అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పులు చెబుతున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం
పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వరదల కారణంగా నెలన్నరగా పనులు నిలిచిపోయాయని అన్నారు. మరో రెండు వారాల పాటు పనులు ప్రారంభించే అవకాశాలు లేవని, సెప్టెంబర్ నుంచి వేగంగా పనులు జరుగుతాయని తెలిపారు. వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వరకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సర్వేలెన్స్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
వారానికోసారి పోలవరం ప్రాజెక్టుపై వర్చువల్ ఇన్స్పెక్షన్
వరద నీరు వెళ్లగానే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ప్రతి రోజు 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేయాల్సి ఉందని, డయాఫ్రాం వాల్ నిర్మాణానికి పనులు వేగవంతం చేశామని, ఎల్అండ్టీ, బావర్ సంస్థలు భారీ యంత్రాలను తెప్పించాయని, వారానికోసారి పోలవరం ప్రాజెక్టుపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేస్తానని సీఎం పేర్కొన్నారు
ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తా
ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.1700 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. పోలవరం పనులకు వైసీపీ, కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే కమిషన్ల కోసం కాలువలు తవ్విన వైసీపీ, కాంగ్రెస్కు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆరు నెలల్లో టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి గోడపై పోస్టర్లు అంటించే సంస్కృతికి స్వస్తి పలకనున్నట్లు ఆయన వివరించారు. మున్సిపాలిటీల్లో పరిస్థితులను కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వర్చువల్ ఉపయోగిస్తామన్నారు.