పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
మచిలీపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాగళం యాత్రలో భాగంగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి బందరులో రోడ్ షో నిర్వహించారు. రెండు పార్టీల అధినేతలు రావడంతో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో బందరు కోనేరు సెంటర్ కిక్కిరిసిపోయింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలను హింసించి శిరోముండనం చేసిన వ్యక్తిని జగన్ ఎమ్మెల్యేను చేస్తానంటున్నాడని ధ్వజమెత్తారు. ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానిలు ఉన్నారని.. ఒకరు బూతుల నాని.. మరొకరు నీతుల నాని అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తమను తిట్టడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. బందరుకు ఏం చేశావో చెప్పే ధైర్యం నీతుల పేర్ని నానికి ఉందా? అని సవాల్ విసిరారు. ఎన్ని నిధులు తెచ్చాడో తెలీదు కానీ.. ముడుపులు మాత్రం బాగా తీసుకుంటాడని ఆరోపించారు.

నీతుల నాని పోయాడు.. బుల్లి కిట్టు వచ్చాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గంజాయి బ్యాచ్ ను నిర్వహించేది కిట్టూనే అని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ కాదు.. టాప్ 10 చేపడతామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. భోగరాజు పట్టాభి మెమోరియల్ కు ఎన్వోసీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం అందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ అని తెలిపారు. ఎంతో మంది విమర్శలు చేసినా.. అదరక బెదరక ధైర్యంగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు మెచ్చుకున్నారు. ప్రజలు నిలిచి రాష్ట్రాన్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, పెడనలో తెలుగుదేశం, జనసేన నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. మద్యం, ఇసుక, భూదందాల డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications