కన్ఫ్యూజ్ వద్దనే పవన్, నాలా పోరాడలేదు: చంద్రబాబు
హైదరాబాద్: తెలుగు ప్రజల సమస్యల పైన తనలా ఎవరు పోరాడలేదని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూడా.. తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని, కాంగ్రెసు వ్యతిరేక ఓట్లు చీల్చవద్దని పోటీ చేయలేదని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. పోటీ నుండి తప్పుకున్న పవన్ తమకు మద్దతు పలికారని గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేయవద్దని భావించే ఆయన తప్పుకున్నారన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు అన్నారు.
అవినీతి, అసమర్థత పైన, కుట్ర రాజకీయాల పైన తాము విజయం సాధించామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, ప్రలోభాలు చేసినా తమ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడితే అందులో మూడు టిడిపి సహకారంతో ఏర్పడినవే అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ జీరో అయిందన్నారు. ఎన్డీయేకు 300కు పేగా స్థానాలు వస్తాయని తాను ముందే చెప్పానని తెలిపారు.
తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ కంటే టిడిపి, బిజెపి కూటమికే ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చారన్నారు. దేశ ప్రయోజనాల కోసమే తాము బిజెపితో పొత్తు పెట్టుకున్నానని చెప్పారు. మోడీ గెలుపు ముందే ఊహించామన్నారు. మోడి వేవ్లా వచ్చిందని ఇప్పుడు అందరికీ అర్థమైందన్నారు. తెలంగాణలో తమ పైన అపవాదులు వేసినప్పటికీ వారి మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. అందుకే తాము టిడిపిలో కాంగ్రెసు కంటే ముందున్నామన్నారు.
యూపిఏ అవినీతి, అసమర్థత వల్ల దేశం భ్రష్టు పట్టిపోయిందన్నారు. తన తెలివితేటలు ఉపయోగించి సీమాంధ్ర అభివృద్ధికి పాటుపడుతానన్నారు. కాంగ్రెసు పార్టీ ఇష్టారీతిగా విభజన చేసిందన్నారు. రాజధాని చెప్పకుండా విభజన చేసిందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ సీమాంధ్ర భవిష్యత్తు పైన హామీ ఇచ్చారన్నారు. తన జీవితంలో చాలామందితో పోరాడానన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చెన్నారెడ్డి, జనార్ధన్ రెడ్డి, విజయ భాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి.. ఇలా అందరితో పోరాడుతున్నామన్నారు.
కష్టకాలంలో సీమాంధ్రను ఆదుకుంటానని చెప్పిన మోడీకి కృతజ్ఞతలు అన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో గెలుపొందిన కెసిఆర్కు అభినందనలు అన్నారు. సమస్యను జఠిలం చేయవద్దని, పరిష్కరించేందుకు చూడాలన్నారు. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా టిడిపి పోరాడుతుందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయమే తమ ధ్యేయమన్నారు.
తన జీవితంలో తాను చేసిన పోరాటం ఎవరు చేయలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేశానన్నారు. ధర్నాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేశానన్నారు. గల్ఫ్లో తెలుగు వారి పైన స్పందించానన్నారు. ఉత్తరాఖండ్లో తెలుగు వారు చిక్కుకుంటే తాను స్పందించానని తెలిపారు. ఉత్తర తెలంగాణ ఏడారిగా మారుతుందంటే బాబ్లీ ప్రాజెక్టు పైన పోరాడి జైలుకు వెళ్లానని తెలిపారు.
ప్రజలు అవినీతిరహిత, సుపరిపాలన, అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. తాను చేసినన్ని పోరాటాలు జీవితంలో ఎవరు చేయలేదన్నరు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఈ ఫలితాల కోసం ఎదురు చూశారన్నారు. యూపిఏ దారుణంగా పాలించిందన్నారు. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. సీమాంధ్ర, తెలంగాణ పైన తమ బాధ్యత ఉందన్నారు.