నాకు తెలియదు, అలా అనుకోలేదు.. ఇంతకుమించి మాట్లాడను: రెక్కీపై బాబు
తన ఢిల్లీ పర్యటనలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు స్పందించారు. తాను ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదన్నారు.
హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటనలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు స్పందించారు. తాను ఎవరికీ చెడు చేయాలని అనుకోలేదన్నారు.
ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రెక్కీ విషయంమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు స్పందించారు. తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు.
కాగా, చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టుగా ఢిల్లీ పోలీసుల నిఘాలో తేలింది. సీఎం కదలికలపై ఓ కన్నేసి ఉంచిన మావోయిస్టులు ఇప్పటికే ఆయన కదలికలపై ఆరుసార్లు రెక్కీ నిర్వహించారని తేలడం విస్మయానికి గురిచేస్తోంది.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్బంగా.. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ భవన్ పరిసరాల్లో మావోయిస్టులు రెక్కీ చేసి వెళ్లినట్టుగా నిఘాలో బయటపడింది.
ముఖ్యంగా మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడికి దిగే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఏపీ భవన్ లో భద్రతా లోపలున్నాయని, ఈ విషయంపై ఎన్నిసార్లు అక్కడి అధికారులను హెచ్చరించినా లాభం లేకపోయిందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
'మీడియా ముసుగులో చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేసే అవకాశం'
అయితే రెక్కీలో ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఏపీ భవన్ అధికారులకు ఇదే తమ చివరి హెచ్చరిక అని.. ఇకనైనా సీఎం భద్రత విషయంలో పకడ్బందీగా ఉండాలని ఢిల్లీ పోలీసులు తెగేసి చెప్పినట్టు సమాచారం.