చినరాజప్పపై చంద్రబాబు బరువు: చెన్నైలో చిక్కుకున్న అభిషేక్ బచ్చన్ రేణిగుంటకు
అమరావతి: భారీ వర్షాల కారణంగా వరదలు బాగా వస్తున్నందున చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నాలుగు జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కరువు, వరద సహాయ నిధులు సకాలంలో అందేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపునకు ఎఫ్సీఐను ఆదేశించేలా కేంద్రంతో మాట్లాడాలన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలను ఆనుకొని గురువారం అల్పపీడనం ఏర్పడింది. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి మరింత బలపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ ప్రభావంతో శుక్రవారం కోస్తా తమిళనాడులో పలు చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలోనూ కొన్ని చోట్ల వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించారు.
చెన్నైలో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తమిళనాడు రాజధాని చెన్నైలోని వరదల్లో చిక్కుకున్నారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ పోటీల్లో చెన్నై, ముంబై జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీల కోసం అభిషేక్ చెన్నై వచ్చారు.
చెన్నై నుంచి ముంబై వెళ్లేందుకు ఆయన బుధవారం విమానాశ్రయానికి వెళ్తుండగా వరదల్లో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ట్విట్టర్ ద్వారా చెప్పారు. చెన్నై వరద నీరు అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
తనను కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రత్యేక బస్సులో చెన్నై నుంచి చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రాత్రి ఏడు గంటలకు స్పైస్ జెట్ విమానంలో ముంబై వెళ్లారు.