2019లోను రాహుల్ గాంధీతోనే! తెలంగాణలో ప్రచారం చేస్తా, కానీ: చంద్రబాబు ఊహించని షాక్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను దూషిస్తుంటే తెలంగాణ ప్రజలే హర్షించడం లేదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఇక్కడ కూటమి లేదా టీడీపీ అధికారంలోకి వస్తే నేను ఏమైనా ముఖ్యమంత్రిని అవుతానా అని ప్రశ్నించారు.
Recommended Video
మహాకూటమి అనివార్యమని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి కలసి ఉండాలనేదే తన కోరిక అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా తెలుగు ప్రజల కోసమే పని చేస్తుందని చెప్పారు. మహాకూటమి ద్వారా వచ్చే లోకసభ ఎన్నికల నాటికి కేంద్రంలో రాజకీయంగా అనేక మార్పులు రానున్నాయని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ కోసం కష్టపడ్డా
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ అభివృద్ధికి తాను ఎంతో కష్టపడ్డానని చంద్రబాబు నాయుడు చెప్పారు. తన హయాంలో అనేక ఐటీ పరిశ్రమలు తెచ్చానని, దీంతో సైబరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి తొలుత ఇక్కడి నుంచి ఎమిరేట్స్కు తొలి విమానం నడిపేందుకు ఎంతో శ్రమించానని అన్నారు.
టిక్కెట్లపై ఎక్కువ ఆశలొద్దు.. 18సీట్లతో సర్దుకుపోదాం, కాంగ్రెస్ గెలుపు ముఖ్యం!: బాబు షాకింగ్
ఇప్పుడు విజయవాడ కోసం కష్టపడుతున్నా
ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమానం నడిపేందుకు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దు అన్నట్లుగా టీఆర్ఎస్ పని చేస్తోందని విమర్శించారు. టీడీపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేపడుతున్న చర్యలు, మాట్లాడుతున్న మాటలపై ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
లోకసభ ఎన్నికల్లోను కాంగ్రెస్తో!
వచ్చే లోకసభ ఎన్నికలలో ఇతర పార్టీలతో మాట్లాడి దానికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రయత్నాలకు తెలంగాణలో ఇప్పుడు ఏర్పాటు చేసిన మహాకూటమి నాంది అన్నారు. ఇలాగే లోకసభ ఎన్నికల్లోనూ కలసికట్టుగా బీజేపీపై పోరాడాలని యోచిస్తున్నామని చెప్పారు. తద్వారా 2019 ఎన్నికల్లోను కాంగ్రెస్తో కలిసి వెళ్తామని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లుగా భావించవచ్చు. రాహుల్ గాంధీ హోదా కూడా ఇస్తానని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోకసభ ఎన్నికల్లోను టిడిపి, కాంగ్రెస్ కలిసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
మోడీపై చంద్రబాబు ఆగ్రహం
దేశంలో ప్రధాని మోడీ చేపట్టిన జీఎస్టీ, నోట్ల రద్దు వంటి చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. కొంతమంది కార్పొరేట్ల కోసమే మోడీ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు గుర్తు పెట్టుకోదగిన ఒక్క పథకాన్నీ మోడీ ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. రఫేల్ స్కాంతో దేశ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉండకూడదన్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు.
కేసీఆర్పై చంద్రబాబు ఆగ్రహం
తెలంగాణలో కేసీఆర్ తీరు కూడా ప్రధాని మోడీలాగే ఉందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మహాకూటమి ఏర్పాటుకు ఇక్కడి టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ఇతర నేతలు తీసుకున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. అవసరమైతే సీట్లను త్యాగాలు చేయాల్సి వస్తుందని, గెలిచే సీట్లనే తీసుకోవాలని, అన్ని సీట్లూ కావాలని, టిక్కెట్లు రాలేదని అసంతృప్తి చెందవద్దని, ఎన్నికల్లో గెలిచాక అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక అవకాశాలుంటాయని, టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా టీడీపీ పని చేయాలని చంద్రబాబు అంతకుముందు నేతలకు సూచించారు.
ట్విస్ట్.. ప్రచారానికి చంద్రబాబు
తెలంగాణలో ప్రచారానికి నేను కూడా వస్తానని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు ఆయన ప్రచారానికి రాకపోవచ్చునని భావించారు. కానీ అవసరమైతే తాను వస్తానని తెలంగాణ టీడీపీ నేతలతో చెప్పారు. ఇది చాలామంది ఊహించని విషయమే. ఆయన ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుందని, కాబట్టి చంద్రబాబు ప్రచారానికి రారని భావించారు. అయితే చంద్రబాబు హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ప్రచారం చేయవచ్చునని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకుంటారా లేదా కూడా చూడాలి.