మోడీతోనే బాబు: ఎన్నికలకు ముందా, తర్వాతా?
హైదరాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతోనే కలిసి నడవాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. విభజన విషయంలో బిజెపిపై కాస్తా అక్కసు వెళ్లగక్కినప్పటికీ పునరాలోచన చేసి బిజెపి నాయకత్వంలోని ఎన్డియేతోనే నడవాలని ఆయన నిశ్చయించుకున్నట్లు అర్థమవుతోంది. కేంద్రంలో ఎన్డీయేతోనే తెలుగుదేశం పార్టీ ప్రయాణిస్తుందని, అయితే ఎన్నికలకు ముందు కలవాలా తర్వాత కలవాలా అనే అంశంపైనే ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి.
తెలంగాణలోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, డివిజన్ కమిటీ అధ్యక్షులకు ఎన్టీఆర్ భవన్లో సోమవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు అందులో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. తన ప్రసంగంలో చంద్రబాబు బిజెపిని ప్రస్తావించకుండా ఎన్డీయే ప్రస్తావన మాత్రమే తెచ్చినట్లు సమాచారం. గతంలో మనం ఎన్డీయేలో ఉన్నామని, మంత్రి పదవులు తీసుకోకపోయినా అప్పట్లో రాష్ట్రానికి చాలా చేసుకొన్నామని, ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో మనం చేసుకోవాల్సిన పనులు, తెచ్చుకోవాల్సిన నిధులు చాలా ఉన్నాయని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని ఎంత త్వరగా ఇంటికి పంపితే అంత త్వరగా దేశం బాగుపడుతుందని, ఆ పార్టీని ఓడించాలంటే ఎన్డీయేకు మద్దతు తప్పదని, తృతీయ ఫ్రంట్ ఇంకా ఒక రూపు దిద్దుకోలేదని, ఎన్డీయేతో ఎన్నికల ముందు కలవాలా లేక తర్వాతా అని ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో పొత్తు ఎందరికి ఇష్టమో చెప్పాలని కోరినప్పుడు సమావేశంలోని చాలామంది చేతులెత్తారు. ఎంతమందికి ఇష్టం లేదో చెప్పాలని కోరినప్పుడు కరెంటు పోయింది. దాంతో అభిప్రాయ సేకరణ ప్రక్రియ జరగలేదని మంగళవారం వార్తలు వచ్చాయి.
బిజెపితో పొత్తు ఉంటే మహబూబ్నగర్లో తాము నాగం జనార్దన్ రెడ్డికి ఓటు వేయాల్సి వస్తుందని, పొత్తు వద్దని ఆ జిల్లాకు చెందిన కొంతమంది కోరారు. దీంతో, వ్యక్తుల గురించి ఆలోచించవద్దని, మొత్తంగా పార్టీ రాజకీయ విధానం ఎలా ఉండాలో ఆలోచించాలని ఆయన వారికి సూచించినట్లు సమాచారం.
అయితే, తాము ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి నాయకులు సుముఖంగా లేరు.