బాగా పనిచేస్తున్నాడు: లోకేశ్కు మంత్రి పదవిపై చంద్రబాబు
అమరావతి: ప్రజా ధనాన్ని లూటీ చేసిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక టీవీ ఛానెల్కు ఇంటర్యూలో చంద్రబాబు మాట్లాడుతూ కొందరు రాక్షసుల్లా అడ్డుపడినా, రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నామని అన్నారు.
కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టారని.. రాజధాని నిర్మాణంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడ్డారని, అయినా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతోందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిని చూసి కొందరు ఓర్వ లేకపోతున్నారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని అడ్డుపెట్టుకుని నాడు ఎవరికి కావల్సింది వారు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టిన వారికి నన్ను విమర్శించే ఆర్హత లేదని, మంచిపనులు చేసినంత వరకు ప్రజల మనసులో ఎప్పటికీ ఉంటారని అన్నారు. ప్రజా స్వామ్యం, ప్రజలపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ సుస్థిర ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ప్రస్తుతం భష్టు పట్టిన వ్యవస్థ, గాడి తప్పిన పాలనను చక్కదిద్దిన పనిలో ఉన్నానని చెప్పారు. నీతివంతమైన, సుదీర్ఘమైన పాలన ఇవ్వడం టీడీపీ సిద్ధాంతంగా ఆయన చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని అనుసంధానం చేస్తూ ముందుకెళతామని అన్నారు.
అతి త్వరలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు లోకేశ్కు కేబినెట్లో మంత్రి పదవి కల్పించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ కార్యక్రమాల దృష్ట్యా లోకేశ్ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. విభజన వల్ల తలెత్తిన సమస్యలకు పరిష్కారం దొరకడం కొంత సమయం పడుతుందని అన్నారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని తెలిపారు. నదుల అనుసంధానం చేయకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదని అన్నారు. నదుల అనుసంధానికి సమగ్రమైన విధానాన్ని రూపొందించామని పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్పై మాట్లాడే వారికి ఏం అనుభవం ఉందని ఆయన మండిపడ్డారు.