దేశంలో ఏ సీఎం కోర్టులో ఇన్నిసార్లు తల దించుకోలేదు జగన్ రెడ్డి : మాన్సాస్ తీర్పుపై చంద్రబాబు
మాన్సాస్ ,సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయిత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. హైకోర్టు తీర్పు హర్షణీయమని పేర్కొన్న చంద్రబాబు వైసిపి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదు
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. అంతేకాదు న్యాయం పై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోమారు స్పష్టమైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదు అన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని, ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు.

జగన్ దుర్మార్గపు ఆలోచనలకు కోర్టు తీర్పుతో అడ్డుకట్ట
ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూములు కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గపు ఆలోచనలకు కోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముందు వెనుకలు చూసుకోకుండా, ఏమీ ఆలోచించకుండా జీవోలు ఇవ్వడాన్ని ఇకనైనా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కోర్టులో తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హైకోర్టు తీర్పు తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని విడనాడాలని చంద్రబాబు హితవు
చీకటి జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది అని ఆయన అభిప్రాయపడ్డారు. అశోక్ గజపతిరాజు అలుపెరగకుండా న్యాయపోరాటం చేసి ట్రస్టును కాపాడుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజును అభినందించారు. ఇకనైనా జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని విడనాడాలని చంద్రబాబు హితవు పలికారు . ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను హరించేలా నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి, హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంప పెట్టు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications