టీపై సోమవారంనుంచి ఢిల్లీలో బాబు ఆమరణ దీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారంనుంచి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఈ విషయంపై చర్చించడానికి ఆయన శుక్రవారం ఉదయం సీమాంధ్ర ప్రాంత నాయకులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలనే తన ఆలోచనపై ఆయన వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, విజయరామారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాను దీక్ష చేయాలనుకుంటున్న విషయంపై వారితో చర్చించారు. అయితే, సమైక్య నినాదంతో దీక్ష చేపట్టకూడదని తెలంగాణ నేతలు ఆయనకు చెప్పారు. సమన్యాయం కోసం చేస్తే అభ్యంతరం లేదని వారు చెప్పారు.

సీమాంధ్ర సమస్యలపై పోరాటం చేయాలని తాము చంద్రబాబుకు సూచించినట్లు సమావేశానంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబుతో తమతో చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు తెలంగాణపై వెనక్కి తగ్గబోరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని, వెనక్కి వెళ్లబోదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలని తాము చంద్రబాబుకు సూచించినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర సమస్యలపై, సమన్యాయం కోసం పోరాటం చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ యూటర్న్ కాంగ్రెసు అధిష్టానం ఆదేశం మేరకేనని ఆయన అన్నారు.
తెలుగు ప్రజలతో ఆడుకోవద్దని తాము కేంద్రానికి చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ ఏం చేసిందని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రజల ఆవేదనను పట్టించుకునేవారే లేరని ఆయన అన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
తాము కేంద్రానికి 24 గంటల గడువు ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, సొంత పార్టీ మంత్రులే కాంగ్రెసును తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో లాలూచి పడి మా గొంతు కోశారని కాంగ్రెసు పార్టీ నాయకులే అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రివర్గం ముందు టేబుల్ ఐటమ్గా పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. నీరు, ఉద్యోగాల వంటి సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసతో కుమ్మక్కయి విభజనకు పూనుకున్నారని ఆయన అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా చేయాలని చెప్పామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications