చంద్రబాబునాయుడివైపు చూస్తున్న దేశంలోని రాజకీయ పక్షాలు??
చంద్రబాబునాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎలక్టోరల్ కాలేజ్ లో తక్కువ ప్రాతినిథ్యమే ఉండొచ్చు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం మాత్ర తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశంలోని రాజకీయ పక్షాలన్నీ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారా? అని చూస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రపతి పదవికి ఈనెల 18వ తేదీన ఎన్నిక జరగబోతోంది. ఎక్కువ సమయం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ తమ తమ విధానాన్ని తెలియజేస్తున్నాయి.
Recommended Video
బీఎస్పీ కూడా ఎన్డీయే అభ్యర్థిని ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. ఏపీలో వైసీపీ, ఒడిసాలో బీజేడీ ఎలాగూ మద్దతు ప్రకటిస్తాయి కాబట్టి సాధ్యమైనంతవరకు తమ అభ్యర్థిని గెలిపించుకున్నట్లేననే యోచనలో బీజేపీ నేతలున్నారు. తాజాగా మహారాష్ట్రలో శివసేనను చీల్చడంవల్ల మరింత లాభించనుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై పడింది.
రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను ఎంపిక చేసిన వ్యక్తి
చంద్రబాబునాయుడు అంటే సామాన్యమైన రాజకీయ నేత కాదు. రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను ఎంపిక చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇప్పడు మాత్రం రాష్ట్ర అవసరాల దృష్ట్యా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ముగ్గురు లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు, 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజ్లో 0.60శాతం ఓట్లే ఉన్నాయి.
చంద్రబాబు మౌనం వెనక కారణాలు?
చంద్రబాబు రాజకీయంగా వ్యూహాలు వేయడంలో చాణక్యుడిగా పేరుతెచ్చుకున్నారు. అటువంటి చంద్రబాబు మౌనంగా ఉన్నారు అనుకుంటే పప్పులో కాలేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మౌనం వెనక అనేక కారణాలుంటాయని, తెలుగుదేశం పార్టీ అవసరాలు, భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలన్నీ ఇమిడివుంటాయని చెబుతున్నారు.
రాష్ట్రపతి వచ్చినట్లుగానే కేసీఆర్ భావించారు
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీపడుతున్న యశ్వంత్సిన్హా హైదరాబాద్ వస్తే కేసీఆర్ చేసిన హడావిడి మాములుగా లేదు. రాష్ట్రపతి వచ్చినట్లుగానే ఆయన భావించారంటున్నారు. యాంటీ మోడీ నినాదాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనుకుంటున్న కేసీఆర్ తెలంగాణ నుంచే ఆ నినాదాన్ని ప్రారంభిస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసినా సిన్హాకే మద్దతు తెలిపి తమ రాజకీయ మార్గాన్ని స్పష్టం చేశారు.
తటస్థంగా ఉంటే..
తాము దగ్గరవుదామనుకుంటున్నా దూరం పెడుతున్నవారికి ఓటు వేయడం ఎందుకనుకుంటే తటస్థంగా ఉండిపోతారని, రాజకీయంగా తర్వాత అవసరం ఉందనుకుంటే బీజేపీ అభ్యర్థినికి మద్దతు ప్రకటిస్తారని భావిస్తున్నారు. అధికార, విపక్షాలెందుకులే అనుకుంటే తటస్థంగా ఉండిపోతారంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయం దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.