బాబుకు ఊరట దక్కేనా- నేడే తీర్పు: ఆ 3 కోర్టుల్లో: పిటీషన్లు, వాదనల వివరాలు ఇవే
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ పరిస్థితుల్లో స్కిల్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్.. నేడు సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది. గతంలో ఏపీ హైకోర్టు ఈ పిటీషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, అందుకే ఈ కేసులో కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలని, ఈ కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ వేశారు చంద్రబాబు.
ఇదివరకు ఏపీ హైకోర్టు ఈ పిటీషన్ను కొట్టేసిన నేపథ్యంలో- చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కిందటి నెల 27వ తేదీన తొలిసారిగా ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారించనున్నారు. దాని తరువాత ఈ నెల 3వ తేదీన మరోసారి విచారణ జరిగింది. నేటికి వాయిదా పడింది.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పైనా విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం నేడే తీర్పును వెల్లడించనుంది. అదే సమయంలో- చంద్రబాబును మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్పైనా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఇక- ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు చేపట్టిన విచారణకు ముగిసింది. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
వీటితో పాటు వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లపై నేడే తీర్పు వెలువడే అవకాశం ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపైనా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ అయింది.












Click it and Unblock the Notifications