స్వాధీనం తప్పదు: జగన్ పత్రికపై తేల్చిన చంద్రబాబు, గొడుగులు పట్టుకుని మహిళలు
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబునాయుడు నోట మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆధ్వర్యంలోని 'సాక్షి' దినపత్రిక ప్రస్తావన వినిపించింది.
గతంలో పలుమార్లు ఆ పత్రిక పేరు బహిరంగ వేదికలపై ప్రస్తావించిన చంద్రబాబు... అవినీతి సొమ్ముతో ఏర్పాటైన ఆ పత్రికను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.
బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై చంద్రబాబు మరోమారు 'సాక్షి' ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి సొమ్ముతో ఏర్పాటైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యమిస్తోందని ఆయన మండిపడ్డారు. అవినీతి ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు, అవినీతి సొమ్ముతో ప్రారంభమైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వపరమవుతుందని చంద్రబాబు చెప్పారు.
జోరువానలోనే సుడిగాలి పర్యటన: గొడుగులు పట్టుకుని వచ్చిన మహిళలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సాంతం వర్షంలోనే కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకే ప్రత్యేక విమానంలో జిల్లాలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు.. అక్కడి నుంచి బస్సులో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరుకు చేరుకున్నారు.
అప్పటికే చిన్నగా ప్రారంభమైన వర్షం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయని చంద్రబాబు తన షెడ్యూల్ లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేదికలపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జోరువాన కురుస్తున్నా.. చంద్రబాబును చూసేందుకు మహిళలు గొడుగులు పట్టుకుని మరీ బయటకు రావడం కనిపించింది.