పథకాలపై క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు-ఢిల్లీ ఫలితాలు అడ్డుపెట్టి..!
ఇవాళ వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆప్ కలల్ని కాషాయ దళం కల్లలు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన పథకాల హామీల్ని అమలు చేయడం లేదని విమర్శలు ఎదురవుతున్న వేళ చంద్రబాబు కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవాళ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, తాను ప్రచారం చేసిన ఎన్డీయే మిత్రపక్షం బీజేపీ ఘనవిజయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని స్వాగతించిన చంద్రబాబు.. అదే సమయంలో తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవాలన్న కేజ్రివాల్ వ్యూహం విఫలమైందని విశ్లేషించారు. దీన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీలో బటన్ నొక్కుడు విధానం సక్సెస్ కాలేదని చంద్రబాబు తేల్చిచెప్పేశారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ కూడా భారీగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చాయి. అయితే అప్పటికే ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారు. ఇందులో పథకాల హామీల్ని సైతం వారు పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం పథకాల అమలుకు ప్రయత్నించిన ఆప్ మోడల్ ను జనం తిరస్కరించారంటూ పేర్కొన్నారు. అంతే కాదు ఏపీలోనూ గతంలో ఈ బటన్ మోడల్ ఫెయిల్ అయిందని గుర్తుచేశారు. తద్వారా రాష్ట్రంలో పథకాల స్ధానంలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలన్న తన ఆలోచనను అలా సమర్దించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications