నాడు బాలకృష్ణకు చెక్ చెప్పి, నేడు లోకేష్ కోసం చంద్రబాబు చక్రం?
విజయవాడ: ఒకప్పుడు వారసత్వ రాజకీయాలకు నో చెప్పిన టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు తన తనయుడు నారా లోకేష్ కోసం చక్రం తిప్పుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను చంద్రబాబు ఎన్నోసార్లు వ్యతిరేకించారు.
కాంగ్రెస్ పార్టీది వారసత్వ రాజకీయమని ఆయన దుమ్మెత్తి పోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, తన సొంత బావమరిది బాలకృష్ణను తన మామ నందమూరి తారక రామారావు తన రాజకీయ వారసుడిగా ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు వారసత్వ రాజకీయాలు వద్దని చెప్పినట్లుగా వాదనలు ఉన్నాయి.
1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు.. చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో తన రాజకీయ వారసుడిగా బాలకృష్ణ పేరును ఎన్టీఆర్ ప్రకటించారని, దానిని చంద్రబాబు వ్యతిరేకించారని చెబుతుంటారు.
మనం కాంగ్రెస్ పార్టీ దారిలోనే (వారసత్వం) వెళ్తే పార్టీ దెబ్బతింటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారని చెబుతారు. తాము కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని, బాలకృష్ణను రాజకీయ వారసుడిగా ప్రకటిస్తే టిడిపికి కాంగ్రెస్ పార్టీకి తేడా ఉండదని ఆయన చెప్పారని అంటారు.
ముప్పై ఏళ్ల తర్వాత తిరిగి చూస్తే, ఇప్పుడు తన తనయుడు లోకేష్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
లోకేష్ భావి ముఖ్యమంత్రి అని, అతను ఎన్నికల్లో పోటీ చేస్తామంటే తాము తమ పదవులు వదిలేస్తామని చెబుతున్న టిడిపి నేతలు కనిపిస్తున్నారు. లోకేష్ విషయంలో మాత్రం చంద్రబాబు వారసత్వాన్ని పక్కన పెట్టలేకపోతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం లోకేష్ వారసత్వానికి.. నాడు చంద్రబాబు వ్యతిరేకించిన బాలకృష్ణ కూడా వ్యతిరేకంగా ఉండరనే చెప్పవచ్చునని అంటున్నారు. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని లోకేష్ పెళ్లి చేసుకున్నారు. అల్లుడికి రాజకీయ వారసత్వం కాబట్టి బాలకృష్ణ నో చెప్పే పరిస్థితి లేదని అంటుంటారు.