చంద్రబాబు ఆపరేషన్ -2024 షురూ : అటు పవన్..ఇటు జూ ఎన్టీఆర్ : జగన్-పీకేలకు కౌంటర్..ఇలా..!!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అధికారంలో ఉన్న వైసీపీ ముందుగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఏకంగా కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికలకు ముందస్తుగా సిద్దం కావాలనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని స్వయంగా చెప్పుకొచ్చారు. దీంతో..ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచే రాజకీయం వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వరుసగా జరిగిన పంచాయితీ..మున్సిపల్...జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బ తింది.
దిద్దుబాటు..టీడీపీ పోరుబాట
టీడీపీకి ఇక ఫ్యూచర్ లేదంటూ వైసీపీ మైండ్ గేమ్ తో పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో.. టీడీపీ నేతలు సైతం అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. కారణాలు ఏమైనా చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా ఉండటం ఏపీలో పార్టీ నేతలకు అందుబాటులో ఉండకపోవటం ఇబ్బందిగా మారింది. ఇక, వైసీపీ అధినేత..సీఎం జగన్ వ్యూహాలు అర్దం చేసుకున్న చంద్రబాబు...కౌంటర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందు కోసం ఆయన కొత్త వ్యూహం అమలు చేయటానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు వైసీపీనీ ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నా..అధికారంలో ఉండటంతో వైసీపీ ముందు ఆ శక్తి సరి పోవటం లేదు.
పాత మిత్రులతో తిరిగి స్నేహం దిశగా..
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకే పరిమితమైన టీడీపీ ఈ సారి మాత్రం జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. దీంతో...బీజేపీ కోసం ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే...రాష్ట్ర స్థాయిలో కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా మాజీ మిత్రుడు..జగన్ రాజకీయ ప్రత్యర్ది అయిన పవన్ తో తిరిగి కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తాజాగా..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కార్మికులకు మద్దతుగా పవన్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో..పవన్ కు టీడీపీ సైతం మద్దతు ప్రకటించాలని భావిస్తోంది.
టీడీపీకి పవన్ కావాలి..జనసేనాని సిద్దమేనా
ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పవన్ పోరాడుతారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ పరిణామాలు లోతుగా పరిశీలిస్తే వారు ఎక్కువ కాలం బీజేపీతో కలిసి ఉండే పరిస్థితులు లేవనేది టీడీపీ నేతల అంచనా. ఇప్పటికే తెలంగాణ బీజేపీతో జనసేన దూరంగా ఉంటుంది. దీంతో..ఢిల్లీ కేంద్రంగా టీడీపీ బీజేపీతో మైత్రికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే 2014 తరహాలో..లేకుంటే జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. జనసేన పార్టీ బీజేపికి దూరమైతే తమ మద్దతు ఉంటుందని వామ పక్షాలు స్పష్టం చేస్తున్నాయి.
జగన్ ను అడ్డుకోవలంటే పవన్ కు తప్పదంటూ..
అయితే, ఏపీలో బీజేపీ - జనసేన పొత్తు ఉన్నా అంతగా ప్రభావం చూపే విధంగా ఇద్దరూ కలిసి పని చేసిన సందర్భాలు లేవు. జనసైనికులు సైతం బీజేపీతో కట్ అవ్వాలనే కోరుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ-జనసేన అనధికారిక పొత్తులతో కలిసి పని చేసాయని చెబుతున్నారు.
దీంతో..దీనిని వచ్చే ఎన్నికల నాటికి అధికారికం చేసుకోవాలన టీడీపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేయగలిగితే ఇక తిరుగు ఉండదనే ఆశలు టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. వైసీపీ సైతం అదే అంచనా వేస్తోంది.
జూనియర్ నూ తెచ్చే యత్నాలు..
టీడీపీని వచ్చే ఎన్నికల్లోనూ గెలవకుండా ..తామే అధికారంలో కొనసాగితే ఇక, టీడీపీ మనుగడ కష్టమని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటుగా మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం ముందుగానే ఏపీలో ఎంట్రీ ఇస్తోంది. ఇలా..మరోసారి జగన్ -ప్రశాంత్ కిషోర్ ను అడ్డుకోవాలంటే తాము మరింత బలం సాధించాలని టీడీపీ ఆలోచన. ఇందు కోసం పవన్ తో పాటుగా.. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీ సేవలకు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం.
త్వరలో నందమూరి నాయకులతో సమావేశమంటూ..
ఇప్పటికే పార్టీలోని సీనియర్లు...యూత్ సైతం జూనియర్ రాకను కోరుకుంటున్నారు. అందు కోసం త్వరలో నందమూరి కుటుంబ సభ్యులను తన ఇంటికి చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక మంచి అకేషన్ చూసి ఈ ములాఖత్ ఉంటుందని సమాచారం. అదే సమయంలో జూనియర్ ద్వారా లోకేశ్ కు భవిష్యత్ లో పోటీ..ఇబ్బంది లేకుండా జూనియర్ ను వచ్చే మహానాడు వేదికగా పార్టీలో క్రియాశీలకంగా ప్రొజెక్టె చేస్తూ..వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయించుకొనేలా వ్యూహాలు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ సమస్యగా..
ముందుగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే తన 40 ఏళ్ల కష్టానికి తన కుమారుడు..పార్టీకి రాజకీయంగా భవిష్యత్ ఉంటుందనేది చంద్రబాబుకు బాగా తెలిసిన విషయమని పార్టీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అటు బీజేపీ..ఇటు జనసేన మీద గత రెండున్నారేళ్ల కాలంలో ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కొన్ని సందర్భాల్లో వారికి మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఏపీలో జగన్ బలంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహాలు ఎంత వరకు అమలు అవుతాయి.. అమలు చేసినా ఎంత వరకు సక్సెస్ అవుతాయనేదే రాజకీయంగా ఆసక్తి కర అంశంగా కనిపిస్తోంది.
జగన్ సైతం దూకుడుగా..చంద్రబాబు వ్యూహాలు అడ్డుకుంటాయా
దసరా సందర్బంగా ఆ సమయంలో పార్టీ పరంగా అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ ను ఎదుర్కొనేందుకు అందరినీ కలుపుకుపోయే ప్రణాళికకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. అయితే, అధికారంలో ఉన్న జగన్ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో ముందున్నారు. ఇప్పటి నుంచే వచ్చే సార్వత్రిక ఎన్నికల కసరత్తు అనధికారికంగా మొదలు పెడుతున్నారు. దీంతో..మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అడుగులు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.