తెలివైనవాడివా, చెప్తే నేర్చుకుంటా: బాబు, ఔట్ డేటెడ్ పొలిటీషియన్: జగన్, ఏబీఎన్ చేతిలో..
హైదరాబాద్: శాసన సభలో మంగళవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. హోదా విషయమై జగన్ మాట్లాడుతూ.. పిఆర్ఎస్ అనే ప్రయివేటు సంస్థ ఇచ్చిన రిపోర్ట్ గురించి ప్రస్తావించారు. పీఆర్ఎస్ నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ...
నా దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయని జగన్ చెప్పారని, ఆయన చెప్పిన దాంట్లో కొన్ని అనుమానాలున్నాయని, వాస్తవాలు ఉంటే ఆయన చెప్పిన దాంట్లో నుంచి నేర్చుకోవాలనుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
పీఆర్ఎస్ అనేది ప్రయివేటు సంస్థ అని చెప్పారు. అవసరమైతే జగన్ ఢిల్లీకి వెళ్లి తెలుసుకోవచచ్చునని సూచించారు. ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధి గురించి తాము అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మీ వద్ద ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ ఇవ్వాలన్నారు. అందరం కలిసి పోరాడుదామన్నారు.
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పది పైసలు రాష్ట్రం కోసం సంపాదించాలనుకుంటున్నానని చెప్పారు. సంపాదకు రహస్యం ఉంటే మీరు చెప్పాలని ఎద్దేవా చేశారు. పీఆర్ఎస్ అనేది ప్రయివేటు సంస్థ అని, అది ఇచ్చే అంశాలు చట్టబద్ధం కాదన్నారు. పార్లమెంటు పరిశోధన గ్రంథం అని జగన్ ఎక్కడ లేని విషయం చెబుతున్నారన్నారు.
చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్: జగన్
చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని, ఇది మన ఖర్మ అని జగన్ అన్నారు. చంద్రబాబు చెప్పడం.. మనం వినడం మన ఖర్మ అన్నారు. పిఆర్ఎస్ విషయమై కేంద్రం మిమ్మల్ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. పిఆర్ఎస్ ఆర్థిక శాఖ కార్యాలయంలోనే ఉందన్నారు.
హిందూలో ఆర్టికల్ రాసే జిఆర్ రెడ్డి గురించి చంద్రబాబుకు తెలుసని, కానీ పిఆర్ఎస్ గురించి తెలియకపోవడం విడ్డూరమన్నారు. చంద్రబాబు చెప్పినా, జగన్ చెప్పినా 2 ఇంటూ టూ 4 అంతే అన్నారు.
జగన్ తాను తెలివైన వాడిని అనుకుంటున్నాడు: చంద్రబాబు
నేను ఔడ్ డేటెడ్ పొలిటీషయన్ అని, తానేదో తెలివైనవాడిని అని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన తాపత్రయపడుతున్నారన్నారు. మేం ఎప్పుడు విలువలకు కట్టుబడి ఉన్నామని, ప్రపంచంలోనే ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని నేనే అని, ఇప్పుడు నేనే ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు.
నీలా తప్పుడు లెక్కలు లేవన్నారు. విలువలు, సంప్రదాయాలు, కేరక్టర్లో నిక్కచ్చిగా ఉంటామని చెప్పారు. తాను కొత్త జనరేషన్ ఏదో జరిగిపోతుందని జగన్ చెబుతున్నారని, కానీ విలువలు కూడా ముఖ్యమన్నారు. నేనే తెలివైనవాడిని అని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. ఢిల్లీ వెళ్లి తెలుసుకోవాలన్నారు. నేనే మేథావిని, కొత్త తరానికి ప్రతినిధిని అని చెప్పడం విడ్డూరమన్నారు.
జగన్ యువతరం అని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మీరు చెప్పింది నిజమైన సమాచారం అయితే తీసుకుంటామని, పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఎప్పుడో పాత గణాంకాలు మాత్రమే ఆయన చదువుకొని వచ్చారు. వాటిని ఇప్పుడు మనం వినాలా? ఇదంతా సభ్యుల ఖర్మ అని జగన్ వ్యాఖ్యానించగా, చంద్రబాబు స్పందించారు.
"జగన్ గారు తానేదో, నేటి తరానికి ప్రతినిధినని అనుకుంటున్నారు. నన్ను ఔట్ డేటెడ్ అంటున్నారు. నేనా..? నెవర్. తానేదో ప్రపంచం అంతా తిరిగానని, తెలివిగల వాడినని ఆయన భ్రమ పడుతున్నారు. చదువుకోమని విదేశాలకు పంపితే తిరుగు టపాలో వెనక్కి వచ్చారు... ఇవన్నీ వదిలిపెట్టండి. డొంక తిరుగుడు వద్దు. మీ దగ్గరేదైనా సమాచారం ఉంటే ఇవ్వండి. అది సరైనదే అయితే తప్పకుండా స్వీకరిస్తాం" అన్నారు.
చంద్రబాబు కంటే మేధావి: జగన్
వీళ్లకు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నానని అభిప్రాయపడ్డారు. కేంద్రం కంటే చంద్రబాబు చాలా మేధావి అన్నారు. చంద్రబాబు కంటే పిఆర్ఎస్ చాలా మేధావులు అన్నారు. దేశానికి పిఆర్ఎస్ మార్గదర్శనం అన్నారు.
ఆర్థిక సంఘాలు కేవలం ప్రణాళికేతర గ్రాంట్స్, రుణాలు మాత్రమే చూస్తాయన్నారు. ఏది లేకున్నా ప్రధాని నిర్ణయం తీసుకుంటే హోదా వస్తుందన్నారు. హోదాపై ఆర్థిక సంఘాలు మాట్లాడవని చెప్పారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రణాళిక సంఘం చేసే దానిని ఆర్థిక శాఖ కూడా చేయవచ్చునని చెప్పారు.
ఏబీఎన్ చేతిలో: జగన్
ఇక్కడ అంతా ఏబీఎన్ చేతిలో ఉందని, అందుకే మా ఖర్మ మాకు మైకులు రావని జగన్ అన్నారు. జగన్ పలుమార్లు మా దురదృష్టం, మా ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ... ప్రభుత్వంపై, తనపై వైసిపి చేస్తున్న ఆరోపణలను శాసనసభలో సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆనాడు కాంగ్రెస్ పై లోకసభలో అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఎందుకు ఉపసంహరించుకున్నారు? అని మరోసారి సభలో ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా విషయంలో తాను కేంద్రంతో రాజీపడ్డానంటూ వైసీపీ అనడాన్ని ఆయన ఖండించారు. తానెక్కడా రాజీపడనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ప్రలోభాలు, బలహీనతలు లేవన్నారు. ఇక రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అవుతానని, ఈ విషయాన్ని తనకు జ్యోతిష్యులు చెప్పారంటున్నారని జగన్ను ఉద్దేశించి అంటూ, సీఎం కావాలని పగటికలలు కనొద్దని జగన్ పై పరోక్షంగా చురక వేశారు. నా వైపు ధర్మం ఉంది నేను ఎవరికీ భయపడనని చెప్పారు.