తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సర్వే
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై టీడీపీ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది.
వచ్చే ఎన్నికలు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా జీవన్మరణ సమస్యలాంటివి. కచ్చితంగా గెలిచి తీరాల్సిన ఆప్షన్ లో టీడీపీ ఉంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అందుకు తగ్గట్లుగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఏయే అంశాలమీద దృష్టి పెడుతుంది? తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి ఎటువంటి వ్యూహాలను రూపొందిస్తుంది? అన్న అంశాలను గమనంలో ఉంచుకున్న చంద్రబాబు అందుకు ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

మండలాలవారీగా జాబితాల పరిశీలన
2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఓటర్ల జాబితా సిద్ధమైంది. మొదట పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి సారించింది. 175 నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఇన్ఛార్జిలు, ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయిలో ఆ జాబితాలను పరిశీలన చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల ఒకటోతేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం యుద్ధప్రాతిపదికన అమలు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలోను సర్వే చేస్తున్నారు. మండలాలవారీగా జాబితాలను పరిశీలించనున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించడంతోపాటు ఓటర్ల జాబితాను జియో ట్యాగింగ్ చేస్తున్నారు.

ఓటర్ల జాబితా జియో ట్యాగింగ్
తెలుగుదేశం పార్టీ ఓటర్లను కూడా జియోట్యాగ్ చేస్తారు. తద్వారా జాబితాలో ఎక్కడైనా పేర్లు నమోదు కాకపోయినా, తీసేసినా వెంటనే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. వైసీపీ అనుకూల ఓటుబ్యాంకు పెరిగేలా వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాను రూపొందించారని, కేవలం తన నియోజకవర్గ పరిధిలోనే ఏడువేల ఓట్లు తొలగించారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ తన నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించుకున్నారు. దీనిద్వారా ఎన్ని ఓట్లున్నాయి? ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? అంటూ వివరాలను పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సర్వే
ఒక్క తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు 25వేల వరకు తొలగించారని ఆయన నిర్థారించుకున్నారు. దీనిపై ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇలాగే చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరణించినవారి ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒకే పేరుతో ఉన్న ఓటర్లు ఎంత మంది ఉన్నారు? వారు ఏ పార్టీకి అనుకూలం? తదితర విషయాలను తెలుగుదేశం పార్టీ తన సర్వేలో సేకరించబోతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఓట్లు తొలగించారో ఒక స్పష్టత వచ్చిన తర్వాత వాటిగురించి పూర్తిస్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications